తుంగభద్ర జలాశయం నుంచి సుమారు 30 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా నివారించే అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనకు సమయం ఇవ్వడం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. స్థానిక నేతల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఈ నీటిని కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. శనివారం రాయచూర్లో జరిగిన 'రాయచూర్ ఉత్సవ్' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.ఏపీ సీఎం గనుక మాకు అవకాశం ఇస్తే, 30 టీఎంసీల తుంగభద్ర నీటి వృథాను అరికట్టి, ఈ ప్రాంత రైతులు, ప్రజలకు న్యాయం చేస్తాం అని శివకుమార్ అన్నారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ కథనం ప్రకారం కాలువల చివరి భూములకు నీరు చేరేలా తమ ప్రభుత్వం కొత్త చట్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. గతంలో తాను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించానని, బంగారప్ప చెరువు కోసం రూ.300 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. తుంగభద్ర డ్యామ్ గేట్లన్నింటినీ మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ పనిని తప్పక పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఆయన ఏకరువు పెట్టారు. మధ్యాహ్న భోజనం, ఉపాధి హామీ, స్త్రీ శక్తి వంటి పథకాలు కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యాయని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంతో పోరాడి ఆర్టికల్ 371J ను తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారని, ఆయనను ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. తమ ఐదు గ్యారంటీల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నామని తెలిపారు.రాయచూర్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని, ఎయిమ్స్ స్థాయి సంస్థను ఇక్కడికి తీసుకురావడానికి కేంద్రానికి లేఖ రాశామని డీకే శివకుమార్ వివరించారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa