ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ గౌరవ్ గొగొయ్ వైరల్ ఫోటోపై అస్సాం సీఎం సూటి ప్రశ్న

national |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 07:58 PM

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ మధ్య రేగిన పాకిస్థాన్ సంబంధాల వివాదం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. గౌరవ్ గొగొయ్ భార్యకు పాక్ జాతీయులతో సంబంధాలు ఉన్నాయని, స్వయంగా ఎంపీ పాకిస్థాన్‌కు దౌత్యపరమైన గుర్తింపును ఇచ్చేలా వ్యవహరించారని సీఎం హిమంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అస్సాం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


పాక్ రాయబార కార్యాలయానికి ఎంపీ ప్రయాణం?


సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో తనకు ఒక ఫోటో కనిపించిందని, అది తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అస్సాంకు చెందిన ఎంపీ గౌరవ్ గొగొయ్, కొందరు యువకుల బృందాన్ని తీసుకుని ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి వెళ్లినట్లు ఆ ఫోటోలో ఉందని ఆయన పేర్కొన్నారు. "అప్పట్లో అబ్దుల్ బాసిత్ పాక్ హైకమిషనర్‌గా ఉండేవారు. ఒక భారతీయ ఎంపీ ఇలా యువకులను పాక్ ఎంబసీకి తీసుకువెళ్లడం అంటే.. ఆ దేశానికి ఒకరకమైన చట్టబద్ధతను, గుర్తింపును కల్పించడమే అవుతుంది" అని సీఎం మండిపడ్డారు. మొదట ఆ ఫోటో ఫోటోషాప్‌లో చేసినట్లుగా తాను భావించానని, కానీ కాంగ్రెస్ నేతలు దానిని సమర్థించడం చూశాక అది నిజమని నిర్ధారణ అయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు.


గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్ గొగొయ్ గతాన్ని కూడా సీఎం హిమంత ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎలిజబెత్ 2011 మార్చి 18 నుంచి 2012 మార్చి 17 వరకు పాకిస్థాన్‌లో పని చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఆమె కుటుంబానికి పాక్ జాతీయుడైన అలీ తౌకీర్ షేక్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబానికి పొరుగు దేశంతో ఇటువంటి సంబంధాలు ఉండటం దేశ భద్రత దృష్ట్యా ఆలోచించాల్సిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.


కార్గిల్ త్యాగాల గుర్తు చేస్తూ ఘాటు విమర్శలు..


ఈ వివాదాన్ని దేశభక్తితో ముడిపెడుతూ సీఎం హిమంత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. "కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఈ ఫోటోను చూడండి. అస్సాంకు చెందిన కెప్టెన్ జింటూ గొగొయ్ మాతృభూమి కోసం తన ప్రాణాలను అర్పించారు. ఎంతోమంది వీరులు అమరులు అయ్యారు. అలాంటి త్యాగాలు జరిగిన దేశంలో.. ఒక ఎంపీ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలవడం అసాధారణమైన విషయం" అని ఆయన వ్యాఖ్యానించారు. దేశమంతా ప్రధాన మంత్రి వెనుక నిలబడి పాకిస్థాన్ కుతంత్రాలను ఎండగడుతుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలాంటి ప్రతినిధి బృందాలతో పాక్ రాయబార కార్యాలయాలను సందర్శించడం శోచనీయమని హిమంత బిశ్వ శర్మ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa