ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఓ గుణపాఠం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 09:15 PM

తిరుపతి జిల్లా పుత్తూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తానూ బలవన్మరణానికి పాల్పడింది. పుత్తూరులోని కృష్ణానగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే చనిపోవటానికి ముందు మహిళ రాసిన లేఖ.. తానెందుకు అంత కఠిన నిర్ణయానికి పాల్పడాల్సి వచ్చిందో తెలియజేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.


పుత్తూరు మండలంలోని నేషనూరుకు చెందిన కన్నెప్పరెడ్డి అనే వ్యక్తికి పద్మ అనే కుమార్తె. పద్మ, తొరూరు పంచాయతీకి చెందిన శివశంకర్ పుత్తూరులో డిగ్రీ చదివారు. డిగ్రీ చదువుకునే రోజులలో వీరి మధ్య స్నేహం ఉండేది. ఈ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పద్మ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. శివశంకర్ వేరే కులానికి చెందిన వాడు కావటంతో పాటుగా.. ఏ పనీ చేయకుండా జులాయిగా ఉండటంతో పద్మను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే పెద్దలను ఎదిరించి మరీ 2019లో పద్మ, శివశంకర్ పెళ్లి చేసుకున్నారు.


ఈ దంపతులకు తేజ శ్రీ (6), లాస్య (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరూ పుత్తూరులోని ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్నారు. అయితే శివశంకర్‌ పనిచేయకుండా జులాయిగా తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో పిల్లల పాఠశాల ఫీజులకు, ఇంటి ఖర్చులకు కూడా పద్మ ఇబ్బందులు పడినట్లు సమాచారం. దీనిపై ఇటీవల పెద్దమనుషులు శివశంకర్‌ను మందలిస్తే.. తనకు శ్రీసిటీలో ఉద్యోగం వచ్చిందని.. ఇకపై మంచిగా చూసుకుంటానని చెప్పినట్లు తెలిసింది. అయితే డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్న పద్మ.. అప్పు కూడా తీసుకున్నారు. ఆ అప్పు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం రోజున బయటకు వెళ్లిన శివశంకర్‌కు ఫోన్ చేసిన పద్మ.. డ్వాక్రా డబ్బులు గురించి అడిగినట్లు తెలిసింది. శివశంకర్ చెల్లించలేదని చెప్పటంతో మనస్తాపం చెందిన పద్మ.. పిల్లలకు ఉరేసి, తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


శనివారం సాయంత్రం బయటి నుంచి ఇంటికొచ్చిన శివశంకర్‌.. తలుపులు ఎంతకీ తీయకపోవడంతో మామ అయిన కన్నెప్పరెడ్డికి ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తలుపులు పగలగొట్టి చూస్తే.. పద్మ, ఇద్దరు పిల్లలూ ఉరి వేసుకుని కనిపించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శివశంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


నేను చనిపోయాక మరో పెళ్లి చేసుకుంటావ్.. ఈసారైనా లైఫ్‌లో సెటిలయ్యాక చేసుకో..


మరోవైపు ఆత్మహత్యకు ముందు తానెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నదీ పద్మ ఓ లేఖ రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖలో..


‘తల్లిదండ్రులను కాదని, వారి మాట వినకుండా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఓ గుణపాఠం. ఒక అమ్మాయి ఏ లక్షణాలు అయితే తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో.. అలాంటి లక్షణాలు అన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. శివశంకర్‌.. నిన్ను లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. నా కడుపున పుట్టినందుకు పిల్లలూ ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే నేనేం చేయాలి. అందుకే ఇక ఉంటా.. నేను చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటావ్, కనీసం ఈ సారైనా లైఫ్‌లో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకో’ అంటూ పద్మ లేఖ రాసింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు ఉరివేసి, తానూ ఆత్మహత్య చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa