ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రుడిపై నగరాన్ని నిర్మిస్తామంటున్న ఎలాన్ మస్క్

international |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 02:37 PM

ఎలాన్ మస్క్ మరో సంచలన ప్రకటన చేశారు. అంగారకుడిపై మానవ ఆవాసాల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్న ఆయన ఇప్పుడు తన ప్రణాళికల్లో కీలక మార్పు చేసినట్లు తెలిపారు. రాబోయే పదేళ్లలోపే చంద్రుడిపై స్వయం సమృద్ధితో కూడిన నగరాన్ని నిర్మించడంపై స్పేస్‌ఎక్స్ ఇప్పటికే దృష్టి సారించిందని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు.అంగారకుడితో పోలిస్తే చంద్రుడిపై నగరాన్ని నిర్మించడం చాలా వేగంగా సాధ్యమవుతుందని మస్క్ వివరించారు. మానవ నాగరికత భవిష్యత్తును కాపాడటానికి చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయడమే వేగవంతమైన, సులువైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. అంగారకుడికి వెళ్లాలంటే గ్రహాల అనుకూలత కోసం 26 నెలలు ఆగాలని, ప్రయాణానికి ఆరు నెలలు పడుతుందని తెలిపారు. కానీ, చంద్రుడిపైకి మాత్రం ప్రతి 10 రోజులకు ఒకసారి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపవచ్చని, ప్రయాణానికి కేవలం రెండు రోజులే పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల నగర నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయవచ్చని అన్నారు.అయితే, అంగారకుడిపై నగరం నిర్మించే ప్రణాళికను పూర్తిగా విరమించుకోలేదని మస్క్ స్పష్టం చేశారు. "రాబోయే 5 నుంచి 7 ఏళ్లలో మార్స్ నగరంపై కూడా పనులు ప్రారంభిస్తాం. కానీ, ప్రస్తుతానికి మాత్రం నాగరికత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చంద్రుడిపై నగర నిర్మాణానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa