ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్ర.... అమెరికా సంచలన ప్రకటన

international |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 08:58 PM

ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయుడు నిఖిల్‌ గుప్తా మాన్‌హటన్‌లోని ఫెడరల్‌ కోర్టులో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ మేరకు అమెరికా అటార్నీ ఆఫీసు ఓ ప్రకటన వెలువరించింది. ఈ ప్రకటన ప్రకారం.. యూఎస్ మెజిస్ట్రేట్‌ జడ్జి సారా నెట్‌బర్న్‌ ముందు ఎదుట హాజరైన నిఖిల్ గుప్తా .. పన్నూని హత్య చేయడానికి డబ్బులు తీసుకోవడం, అందుకు ప్లాన్‌ చేయడం, మనీల్యాండరింగ్ వంటి మూడు అభియోగాలను అంగీకరించాడు. వీటిన్నింటికి కలిపి మొత్తం 40 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మే 29న శిక్ష న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది. అయితే, తాజా పరిణామాలపై గుప్తా తరఫు లాయర్ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు .


 తమ భూభాగంలో పన్నూ హత్యకు పథకం వేశారని, ఆ కుట్రను చేసినట్టు గతంలో అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో భారతీయ వ్యాపారి నిఖిల్‌ గుప్తా పాత్ర ఉందంటూ అమెరికా ఆరోపించింది. ఇందుకోసం ఓ భారత అధికారి నుంచి అతడికి ఆదేశాలు అందాయని పేర్కొంది. ఈ క్రమంలోనే నిఖిల్ గుప్తాను చెక్‌ రిపబ్లిక్‌ అధికారులు అరెస్ట్ చేసి, అనంతరం అమెరికాకు అప్పగించారు. అయితే, తమపై అమెరికా చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై విచారణకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా నిఖిల్ గుప్తా కేసులో జరిగిన పరిణామాలపై భారత్‌ ఇప్పటివరకు స్పందించలేదు.


సిఖ్స్ ఫర్ జస్టీస్‌ నాయకుడు గురు పత్వంత్ సింగ్ పన్నూను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఖలీస్థాన్ వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతున్న ఈ సంస్థతో పాటు పన్నూను భారత్‌ నిషేధించింది. హింస, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారని భారత్ ఆరోపిస్తోంది. పన్నూ హత్యకు నిఖిల్ గుప్తాను భారతీయ అధికారి వికాస్ యాదవ్ నియమించకున్నట్టు అమెరికా న్యాయశాఖ ఆరోపించింది. అతడు విదేశీల్లో భారత గూఢచార కార్యకలపాలు నిర్వహించే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌‌లో కీలక అధికారి ఆదేశాల మేరకు అమెరికా గడ్డపై హత్య చేయడానికి గుప్తా ఒక కిరాయి హంతకుడ్ని నియమించుకోవాలని ప్రయత్నించాడని ఆరోపణలు చేయడం గమనార్హం.


గుప్తా తాను సంప్రదించిన వ్యక్తులు అమెరికా అధికారులని తెలుసుకోలేకపోయాడని, హత్యకు 100,000 డాలర్లు ఇవ్వడానికి బేరం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా 15 వేల డాలర్లు ఇచ్చాడని పేర్కొంది. ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్లు, రోజువారీ దినచర్యలతో సహా వ్యక్తిగత సమాచారాన్ని అందించాడని అధికారులు చెబుతున్నారు. ఈ కుట్రను డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా భగ్నం చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa