తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో శెట్టిబలిజలను బీసీ జాబితా నుంచి తొలగించి ఓసీల్లో చేర్చడం ద్వారా కేసీఆర్ ఆ సామాజిక వర్గానికి తీరని ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగలకుర్రు అగ్రహారంలో జరిగిన 'శెట్టిబలిజ సంఘం స్థూపం' ఆవిష్కరణ సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో శెట్టిబలిజల ఉనికిని దెబ్బతీసేలా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఏపీలోకి అడుగుపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి సుభాష్ ఘాటుగా హెచ్చరించారు. శెట్టిబలిజలంతా ఏకమై ఆ పార్టీని ఇక్కడ తొక్కిపడేస్తారని స్పష్టం చేశారు. పదవులు, పార్టీల కన్నా కుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో శెట్టిబలిజలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని అక్కడి బీసీ కమిషన్ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, ఇతర నేతలు మాట్లాడుతూ కుల ఐక్యతతోనే సామాజిక, రాజకీయ ఎదుగుదల సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. శెట్టిబలిజలు రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని శాసించే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టిన నేపథ్యంలో, శెట్టిబలిజలను తిరిగి బీసీల్లో చేర్చే అంశంపై జరుగుతున్న చర్చల మధ్య మంత్రి సుభాష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa