ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు.. అది కూడా ఓ పోలీసాయనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 07:44 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఓ పోలీస్ అధికారి ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు కలిపారని పదేపదే ఆరోపిస్తూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని దేవరకొండ నాగ వరప్రసాద్ అనే పోలీసాఫీసర్ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఏకలవ్యుడికి చెందిన ఎరుకల కులస్తుడిగా పరిచయం చేసుకున్న నాగ వరప్రసాద్.. తమ జాతి మూల పురుషుడు ఏకలవ్యుడని చెప్పుకొచ్చారు. తమ కులదేవత ఎరుకల నాంచారమ్మ ఎరుక చెప్పడం వల్లే తిరుమల శ్రీనివాసుడి కల్యాణం జరిగిందనే ప్రసిద్ధి అని తెలిపారు. లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారం కారణంగా.. తిరుమల శ్రీవారిని ప్రాణంతో సమానంగా పూజించే తమ సామాజిక వర్గం తీవ్ర మనస్తాపం కలుగుతోందని అన్నారు. కోట్లమంది భక్తుల విశ్వాసాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలోనే పోలీసులను కలిసి ఫిర్యాదు చేశానన్న నాగ వరప్రసాద్.. తన ఫిర్యాదులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్లను ప్రస్తావించినట్లు తెలిపారు. అలాగే కొన్ని మీడియా ఛానెళ్లపైనా ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ అంశంపై డిబేట్లు నిర్వహించి.. భక్తులు వినడానికి కూడా ఇబ్బంది కలిగించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరందరిపైనా చర్యలు తీసుకోవాలని నాగ వరప్రసాద్ డిమాండ్ చేశారు. అలాగే ఏయే తేదీలలో ఎవరెవరు ఏయే వ్యాఖ్యలు చేశారనే దానిపై నివేదికను పోలీసులకు అందించినట్లు తెలిపారు.


తుళ్లూరు పోలీసులు తన ఫిర్యాదును తీసుకున్నప్పటికీ.. అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వలేదన్న నాగ వరప్రసాద్.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు తాను గతంలో శ్రీకాకుళం డీటీసీలో పనిచేసినట్లు నాగ వరప్రసాద్ తెలిపారు. అనంతరం అనంతపురం పీటీసీకి బదిలీ చేశారని..అయితే అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు తెలిపారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ సరైన స్పందన లేదని ఆరోపించారు. ఈ నెలాఖరులోపు తన రాజీనామాను ఆమోదించాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు తిరుమల లడ్డూ విషయంలో చట్టపరంగా ముందుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa