ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతికి ప్రతీకార దాడి తప్పనిసరిగా ఉంటుందని ఇప్పటికే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. దీంతో మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఖమేనీ మృతితో ఈ హర్మూజ్ జలసంధి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ కీలక హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఇక కొన్ని గంటల్లోనే హర్మూజ్ జలసంధికి సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా జరిగిన దాడి తీవ్ర సంచలనంగా మారింది.
పలావు దేశ జెండాతో ఉన్న స్కైలైట్ ఆయిల్ ట్యాంకర్పై ఆదివారం ఒమన్లోని ముసాండమ్ ద్వీపకల్పం సమీపంలో ఖసాబ్ పోర్టు వద్ద ఇరాన్ బలగాలు దాడి చేశాయి. అప్పుడు ఆ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 15 మంది భారతీయులు.. మిగిలిన ఐదుగురు ఇరాన్ వాసులు ఉన్నారు. ఈ దాడిలో నలుగురు గాయపడినట్లు ఒమన్ ప్రకటించింది.
ఒమన్లోని ఖసాబ్ పోర్టుకు ఉత్తరాన 5 నాటికల్ మైళ్ల దూరంలో.. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. గాయపడిన నలుగురు సిబ్బందికి ప్రస్తుతం చికిత్స అందించారు. మిగిలిన వారిని సురక్షితంగా అందులో నుంచి బయటికి తీసుకువచ్చారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న ఆ నౌకపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. ఇది ఇరాన్ చమురును రవాణా చేసే షాడో ఫ్లీట్లో భాగమని అమెరికా ఆరోపిస్తోంది.
ఈ దాడి ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఖమేనీ మరణించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సాయుధ బలగాలు హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించగా.. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా తటస్థంగా ఉండే ఒమన్ భూభాగంపై, దాని సమీపంలో దాడులు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దుక్మ్ పోర్టుపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో 15 మంది భారతీయులు ప్రాణాలతో తప్పించుకున్నప్పటికీ.. ఆ ప్రాంతంలో ఉన్న వేలాది మంది భారతీయుల భద్రతపై ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. ఖమేనీ మృతికి ఒకవేళ ఇరాన్ ఎదురుదాడికి దిగితే.. గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ శక్తితో ప్రతిస్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa