అమరావతిలో నిర్మిస్తున్న జస్టిస్ సిటీని దేశంలోనే అత్యుత్తమ మోడల్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ అథార్టీ ఆధ్వర్యంలో ‘మధ్యవర్తిత్వం’పై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.రాజధాని నిర్మాణంలో భాగంగా జస్టిస్ సిటీలో న్యాయ వ్యవస్థకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ముఖ్యంగా జుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథార్టీ, మీడియేషన్ సెంటర్, ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి కీలక విభాగాలన్నింటినీ ఒకే చోట ఇంటిగ్రేట్ చేస్తూ.. బెస్ట్ జుడిషయల్ సిటీని నిర్మిస్తామని తెలిపారు. ఈ బృహత్తర కార్యానికి సీజేఐ సహకారం కావాలని ఆయన కోరారు. అమరావతిలో 'నేషనల్ జుడిషియల్ అకాడమీ' ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూములు ఇవ్వడానికి, పూర్తి సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీజేఐకి విజ్ఞప్తి చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే సంప్రదాయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. తన తండ్రి కూడా గ్రామంలో పెద్దరికం వహించి, మధ్యవర్తిత్వం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించారని తెలిపారు. కోర్టుల్లో కేసుల భారాన్ని తగ్గించేందుకు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే రూ. 10 వేలు, ఒకవేళ కేసులు పరిష్కారం కాకపోయినా రూ. 3 వేలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. సత్వర న్యాయం అందడం వల్ల అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు.ప్రపంచస్థాయి ప్రమాణాలతో, ప్రజల అవసరాలకు అనుగుణంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో 29,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని, వారి త్యాగంతోనే ఈ నిర్మాణం సాధ్యమవుతోందన్నారు. పర్యావరణ హితంగా, ఆర్థికంగా బలమైన రాజధానిగా ఉండాలనే లక్ష్యంతో.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.అంతకుముందు సదస్సుకు విచ్చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు సీఎం చంద్రబాబు, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa