ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హార్మూజ్ జలసంధిని మూసేసిన ఇరాన్.. భారత్‌ సహా ప్రపంచ దేశాలపై ప్రభావమెంత

national |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 10:43 PM

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులు తీవ్రతరం అయ్యాయి. అదే సమయంలో ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్.. పలు ముస్లిం దేశాలపైనా విరుచుకుపడుతుండటంతో మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇరాన్, యూఏఈ దాడుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ దళాలు మూసివేశాయి. అయితే ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో దాని ప్రభావం భారత్‌పై పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుండగా.. ఇప్పుడు దాన్ని మూసివేయడం ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.


ప్రపంచంలోనే ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలైన ఇరాక్, సౌదీ అరేబియా, యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో ఈ హర్మూజ్ జలసంధి కలుపుతుంది. ఈ హర్మూజ్ జలసంధి గుండా నిత్యం లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఆయా దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇలాంటి వ్యూహాత్మక, కీలక మార్గాన్ని ఇరాన్ ఆర్మీ మూసివేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయాలు వెల్లువెత్తుతున్నాయి. దాని వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి ఉంటుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.


 ఇదే జరిగితే భారత్‌పై కూడా దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అమెరికాకు మద్దతుగా ఉన్న దేశాలపైనా ఇరాన్ సైన్యం దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ నౌకపై ఇరాన్ దళాలు దాడులు చేయడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ ధ్వంసం చేస్తే ఆ ప్రభావం భారత్‌పైనా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.


చమురు కొరత సంభవించే ప్రమాదం ఉందని.. ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్ కావాలని నిపుణులు హితవు పలుకుతున్నారు. చమురు కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


అసలేంటీ హర్మూజ్ జలసంధి?


పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని, అరేబియా సముద్రాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గాన్నే హర్మూజ్ జలసంధి అని పిలుస్తారు. కేవలం 33 కిలోమీటర్ల (21 మైళ్ల) వెడల్పు ఉండే ఈ సన్నటి మార్గం గుండా ప్రపంచ దేశాలకు ప్రతి రోజు చమురు సరఫరా అవుతుంది. అంతర్జాతీయంగా అన్ని దేశాలు రోజూ ఉపయోగించే చమురులో దాదాపు 20 శాతం చమురు ఈ హర్మూజ్ జలసంధి గుండానే తరలిస్తారు.


ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైన్, ఇరాన్ వంటి దేశాలు తమ చమురు ఎగుమతులను ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే ఇతర దేశాలకు తరలిస్తాయి. హర్మూజ్ జలసంధికి సమీపంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ అధీనంలోనే ఉండగా.. ఆ ప్రాంతంలో ఇరాన్ సైనిక శక్తి కూడా చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతాయనే భయాలు వెల్లువెత్తుతున్నాయి.


ఆయిల్ దిగుమతులపై అధికంగా ఆధారపడిన భారత్, చైనా వంటి దేశాలకు హర్మూజ్ జలసంధి మూసివేయడం గుబులు పెట్టిస్తోంది. ఈ హర్మూజ్ జలసంధి ద్వారా తరలించే చమురు ఎగుమతుల్లో 82 శాతం ఆసియా దేశాలే దిగుమతి చేసుకుంటుండటం గమనార్హం. భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లే 67 శాతం వినియోగించుకుంటున్నాయి. మన దేశం వినియోగించే ముడి చమురులో 90 శాతం మధ్య ప్రాచ్యంలో ఉన్న దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో దాదాపు సగం హర్మూజ్ జలసంధి మార్గం గుండానే వస్తోంది. దీంతో ఈ హర్మూజ్ జలసంధి భారత్‌కు ఎంత ముఖ్యమో అర్థం అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa