అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై జరిపిన భీకర దాడుల్లో ఆ దేశ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్తోపాటు మరికొన్ని ముస్లిం దేశాలపై తీవ్ర స్థాయిలో క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతారవణం నెలకొంది. అమెరికా సహకారంతో ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ప్రపంచ దేశాల్లో కూడా అక్కడక్కడా నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇవి పాకిస్తాన్లో మరింత ఎక్కువగానే ఉన్నాయి. పాక్లో నిరసన చేస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన పని.. 10 మంది ప్రాణాలను తీసింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను వ్యతిరేకిస్తూ.. పాకిస్తాన్లోని కరాచీలో ఆందోళనలు చెలరేగాయి. పలువురు ఆందోళనకారులు అక్కడి యూఎస్ కాన్సులేట్పై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో విరుచుకుపడటంతో పరిస్థితి తీవ్రతరం అయింది. ఆ తర్వాత అమెరికా కాన్సులేట్కు నిప్పు అంటించేందుకు ఆందోళనకారులు ప్రయత్నాలు చేయగా వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీఛార్జ్ చేశారు. అయినప్పటికీ ఆందోళనలు ఆగకపోవడంతో కాల్పులకు దిగారు.
ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్రంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా మెరైన్ సెక్యూరిటీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. మరో 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఖమేనీ మృతికి పాకిస్తాన్లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయం.. సంతాపం తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని దాడి చేసి చంపేయడాన్ని వారి పిరికిపంద చర్యగా అభివర్ణించింది.
ఖమేనీ మరణానికి నిరసనగా పాకిస్తాన్ లోని షియా సంఘాలు కరాచీలోని అమెరికా దౌత్య కార్యాలయం వైపు భారీ ర్యాలీగా వెళ్లాయి. వాషింగ్టన్, టెల్ అవీవ్కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తూ బారికేడ్లను తోసుకుని.. అమెరికా కాన్సులేట్ లోపలికి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. పరిస్థితి చేయి దాటి పోవడంతో యూఎస్ కాన్సులేట్ రక్షణలో ఉన్న అమెరికా మెరైన్ సిబ్బంది కాల్పులు జరిపినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
అయితే కేవలం కరాచీలో మాత్రమే కాకుండా పాకిస్తాన్లోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఖమేనీ మృతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. వందలాది మంది నిరసనకారులు లాహోర్లోని అమెరికా కాన్సులేట్ ముందు బైఠాయించారు. రోడ్డుపైనే ప్రార్థనలు చేసి.. అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించడంతో అక్కడ ఎలాంటి హింస చెలరేగలేదు.
అటు.. ఉత్తర పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన కారులు ఐక్యరాజ్యసమితి కార్యాలయ భవనానికి నిప్పు అంటించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కరాచీ, లాహోర్, పెషావర్ నగరాల్లో మరిన్ని నిరసనలు జరిగే అవకాశాలు ఉన్నందున.. అప్రమత్తంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa