ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా తాజాగా ధృవీకరించింది. కొన్ని గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. ఖమేనీ మరణానికి సంతాప సూచికగా ఇరాన్లో ఏడు రోజులపాటు సెలవు దినాలను, 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
శోకసంద్రంలో ఇరాన్.. టీవీల్లో నల్ల బ్యానర్లు
ఖమేనీ మరణవార్త వెలువడినప్పటి నుంచి ఇరాన్ అధికారిక వార్తా ఛానెల్ 'IRINN' శోకతప్త హృదయంతో వార్తలను ప్రసారం చేస్తోంది. టీవీ స్క్రీన్ పైభాగంలో నలుపు రంగు బ్యానర్ను ప్రదర్శిస్తూ.. ఖమేనీ చిత్రపటాల వెనుక నేపథ్యంగా ఖురాన్ పఠనాన్ని వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. 1989 నుంచి దేశాన్ని నడిపించిన ఒక శక్తివంతమైన నేత నేలకొరగడంతో ఇరాన్ ప్రజానీకం శోకసముద్రంలో మునిగిపోయింది.
అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ ఆగ్రహం
ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ఎన్ఎస్సీ) ఒక ఘాటైన ప్రకటనను విడుదల చేసింది. ఖమేనీ మృతిని వీరమరణంగా అభివర్ణిస్తూ.. ఈ దారుణానికి అమెరికా, ఇజ్రాయెల్లే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా "ఖమేనీ ఆత్మబలిదానం వ్యర్థం కాదు. అణచివేతదారులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఇది ఒక గొప్ప తిరుగుబాటుకు ఆరంభం" అని పేర్కొంది. ఈ దాడుల వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందన్న ఆరోపణలతో ఇరాన్ తన సైనిక దళాలను అప్రమత్తం చేసింది.
ఖమేనీ మరణం ఇరాన్ రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. రాజ్యాంగం ప్రకారం తదుపరి సుప్రీం లీడర్ను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఇరాన్ భద్రతా దళాల హెచ్చరికలు చూస్తుంటే పశ్చిమాసియాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa