తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా పత్ర పుష్పయాగం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 7. 30 నుండి 9. 30 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, విబూది, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరంలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగ మహోత్సవం నిర్వహించారు.
స్వామివారి పత్ర పుష్పయాగానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల నుండి దాతలు 2. 5 టన్నులు పుష్పాలు, పత్రాలు విరాళంగా అందించారు. ఇందులో 11 రకాల పుష్పాలు, ఐదు రకాల పత్రాలు ఉన్నాయి. అనంతరం గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులును ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు శాలువాతో సన్మానించారు. లోక క్షేమం కొరకు, ఆలయంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఏవో శేష శైలేంద్ర, ఆలయ ఏఈవో శ్రీనివాపులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa