వైసీపీ పార్టీకి ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏదో ఒక రూపంలో సమస్యలా వెంటాడుతున్నారు. తాజాగా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు తమ కస్టడీలో టార్చర్కు గురి చేశారనీ, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ను రఘురామరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు పిటిషనర్ను ఆదేశించింది. అందుకు 2 వారాల గడువు కావాలంటూ భరత్ తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు కోర్టును కోరారు. కోర్టు అందుకు సమ్మతిస్తూ విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా భరత్ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రఘురామరాజును దాదాపుగా రెండున్నరేళ్లుగా ఏపీలో అడుగుపెట్టనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సీఐడీ కస్టడీలోని రఘురామరాజుపై టార్చర్ జరిగిందని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. అయితే ఆదినారాయణరావు వాదనతో విభేదించిన సుప్రీంకోర్టు... రాష్ట్ర ప్రభుత్వ వాదన విన్న తర్వాతే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలా? వద్దా? అన్న విషయంపై దృష్టి సారిస్తామని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa