కోహినూర్ వజ్రంపై తాజాగా కొత్త వివాదం మొదలైంది. ఆ వజ్రం పూరిలోని జగన్నాథ స్వామిది అని ఓ వ్యక్తి కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో మరోసారి భారత్కు చెందిన కోహినూర్ వజ్రం గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. రాణి కిరీటంలో ఉన్న ‘కోహినూర్’ వజ్రం గురించి కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ వజ్రం పూరిలోని జగన్నాథ స్వామిదని ఒడిశాకు చెందిన సామాజిక-సాంస్కృతిక సంస్థ జగన్నాథ్ సేన సభ్యులు, కవులు వాదిస్తున్నారు. ఒడిశాకు చెందిన చరిత్రకారుడు, భక్తుడు సురేంద్ర మిశ్రా మంగళవారం మాట్లాడుతూ.. జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్ రాజు రంజిత్ సింగ్ స్వామికి కోహినూర్ వజ్రాన్ని కానుకగా ఇస్తానని చెప్పారని, అంతలోనే బ్రిటిష్ సైనికులు దానిని కాజేశారని వెల్లడించారు.
ఇదే అంశంపై పూరీ జగన్నాథ సేన అధ్యక్షుడు, న్యాయవాది ప్రియదర్శన్ పట్నాయక్ సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముని కలిశారు. ‘కోహినూర్’పై తాము అంతర్జాతీయ కోర్టుకు వెళతామని తెలిపారు. ‘‘ప్రస్తుతం బ్రిటన్ రాణి వద్ద ఉన్న కోహినూర్ వజ్రం శ్రీజగన్నాథ్ భగవాన్కు చెందుతుంది.. దీనిని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాం.. మహారాజా రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని జగన్నాథస్వామికి కానుకగా సమర్పిస్తానని చెప్పారు’’ అని ప్రియదర్శన్ పట్నాయక్ అన్నారు.
ఈ విషయంలో రాణికి లేఖ పంపిన తర్వాత తనకు బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి అక్టోబర్ 19, 2016న యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వానికి నేరుగా అప్పీల్ చేయమని కోరుతూ సమాధానం వచ్చిందని వివరించారు. ‘మెజెస్టి సలహా మేరకు వ్యవహరిస్తుంది... మంత్రులు అన్ని సమయాల్లో ఖచ్చితంగా రాజకీయ రహితంగా ఉంటారు’ అని లేఖలో పేర్కొన్నారని ప్రియదర్శన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు. కాగా, లేఖ అందుకున్న తర్వాత ఆరేళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించగా.. తనకు ఇంగ్లాండ్ సందర్శనకు వీసా నిరాకరించారని పట్నాయక్ సమాధానం ఇచ్చారు.
చరిత్రకారుడు అనిల్ ధీర్ మాట్లాడుతూ.. అఫ్గన్ పాలకుడు నాదిర్షాపై విజయం తర్వాత పూరీ ఆలయానికి పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ వజ్రాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలిపారు. కానీ, వెంటనే దానిని అందజేయలేకపోయారని, 1839లో రంజిత్ సింగ్ కన్నుమూసిన పదేళ్ల తర్వాత ఆయన కుమారుడు దిలీప్ సింగ్ నుంచి బ్రిటిషర్లు కోహినూర్ వజ్రాన్ని లాగేసుకున్నారని చెప్పారు. మహారాజా రంజిత్ సింగ్ వారసులు పాక్, అఫ్గనిస్థాన్లో అనేక మంది హక్కుదారులు ఉన్నప్పటికీ సేన వాదన సమర్థించదగిందని పేర్కొన్నారు.
‘‘కోహినూర్ వజ్రాన్ని పూరీ జగన్నాథ్ ఆలయానికి కానుకగా ఇస్తానని మహారాజా రంజిత్ సింగ్ తన మరణానికి ముందు ప్రకటించారు.. దీనిపై బ్రిటిష్ ఆర్మీ అధికారి ధ్రువీకరించిన పత్రం ఢిల్లీలోని జాతీయ ఆర్కైవ్స్లో ఉంది’’ అని ధీర్ తెలిపారు.
కోహినూర్ వజ్రాన్ని లాహోర్ మహారాజు అప్పటి ఇంగ్లండ్ రాణికి 170 ఏళ్ల కిందట అప్పగించలేదని కొన్నేళ్ల కిందట ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. కాగా, రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు చార్లెస్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ప్రిన్స్ చార్లెస్ భార్య కార్న్వాల్ కెమిల్లాను క్వీన్ కన్సార్ట్గా నిర్ణయించారు. కొహినూర్ వజ్రం పొదిగిన కిరీటం ఆమె ధరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa