రష్యా సాగించిన అరాచకానికి నిదర్శంగా ఇజియం పట్టణంలో వందలాది మృతదేహాలున్న ప్రాంతంగా ఉక్రెయిన్ భావిస్తోంది. ప్రత్యేక సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా విధ్యంసాలకు సజీవ సాక్ష్యంగా నిలిచే దారుణమై ఘటనలు ఒక్కొక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఇజియం పట్టణంలో వందలాది మృతదేహాలు పాతిపెట్టిన ప్రాంతాన్ని ఉక్రెయిన్ సైన్యం గుర్తించింది. రష్యా ఆక్రమణలో ఉన్న ఇజియం, చకలోవ్స్కీ సహా పలు ప్రాంతాలను గతవారం ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దండయాత్ర మొదలైన తర్వాత రష్యా సైన్యం ఆక్రమించుకున్న ప్రాంతాల్లో 3,250 చదరపు కి.మీ. భూభాగాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఇజియం పట్టణాన్ని ఉక్రెయిన్ అధికారులు పరిశీలిస్తుండగా.. ఓ అటవీ ప్రాంతంలోని గోతిలో 440కి పైగా మృతదేహాలు బయటపడ్డాయి. ఇజియం ప్రాంతంలో మృతదేహాల దిబ్బలు బయటపడ్డాయని ఉక్రెయిన్ సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు ఈ విషయం వెల్లడించారు. మృతుల్లో చాలా మంది తుపాకి తూటాలకు బలవ్వగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడులకు మరణించి ఉంటారని పేర్కొన్నారు. మరణానికి ముందు బాధితులను చిత్ర హింసలకు గురిచేసినట్టు శరీరాలపై ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు.
ఖార్కివ్ను తిరిగి స్వాధీనం చేసుకున్న అనంతరం.. ఉక్కెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ ఆ నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్లో రష్యా మరణశాసనం రాసిందని ఆవేదన వ్యక్తంచేశారు. బుచా, మరియుపోల్ తర్వాత.. ఖార్కివ్లో దారుణ పరిస్థితులు కళ్లకు కట్టినట్లు కనిపించాయని, ఈ దారుణానికి రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శవాల గుట్టలపై దర్యాప్తు మొదలయ్యిందని, శుక్రవారం దీని గురించి మరింత సమాచారం అందుబాటులోకి వస్తుందని అన్నారు.
ఇదిలావుంటే గతవారం ఇజియం పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ 1,000కిపైగా మృతదేహాలను గుర్తించామని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ సలహాదారు అంటోన్ గెరాష్చెంకో తెలిపారు. ఏప్రిల్లో 458 మృతదేహాలు లభ్యమైన కీవ్ శివారు ప్రాంతం బుచా విషాదం కంటే ఇది మరింత ఘోరమని ఆయన అభివర్ణించారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో బుచా పట్టణాన్ని ఆక్రమించుకున్న రష్యా సైన్యం.. ఉక్రెయిన్ పౌరులను చిత్రహింసలకు గురిచేసి మహిళలపై అత్యాచారాలకు తెగబడింది. బుచా నుంచి రష్యా సైన్యం వైదొలిగిన తర్వాత వీధుల్లోనే డజన్లు కొద్దీ మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. అయితే, రష్యా మాత్రం తాము సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదా యుద్ధ నేరాలకు పాల్పడలేదని పదే పదే చేబుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa