ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 03:46 PM

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. అనంతరం ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. పాయకరావుపేటలోని కంటోన్మెంట్‌ ఏరియాలో ముత్యాల రాజేశ్‌ తన భార్య భాగ్యవతి(26), పిల్లలు సోనియా, హయాన్‌లతో నివాసం వుంటున్నారు. రాజేశ్‌ ఇండో టిబెటన్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తున్నారు.


భాగ్యవతి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవడం కోసం ఆదివారం ఉదయం పట్టణంలోని కల్యాణి ఆస్పత్రిలో చేరగా మధ్యాహ్నం శస్త్రచికిత్స చేశారు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో డాక్టర్‌ వచ్చి ఇంజెక్షన్‌ చేశారు. కొద్దిసేపటి తరువాత ఫిట్స్‌ రావడంతో భాగ్యవతి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. భాగ్యవతి చనిపోవడానికి డాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమంటూ ఘర్షణకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు.


సమాచారం అందుకున్న సీఐ అప్పలరాజు, పోలీసు సిబ్బందితో చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వున్న మృతురాలి భర్త రాజేశ్‌ వచ్చేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేదిలేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా నిరసన తెలుపుకోవాలని పోలీసులు స్పష్టం చేయడంతో ఆస్పత్రి ఎదుట ఖాళీ స్థలంలో టెంట్‌ వేసి దానిలో కూర్చుకున్నారు. కాగా మృతురాలి భర్త వచ్చిన తరువాత ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు చెప్పారని, అంతవరకు వేచిచూస్తామని సీఐ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa