విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చాలని వైసీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ శాసనసభలో స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి.. పేపర్లు విసిరి నిరసన తెలిపారు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా చేశారు.
తనకు హిందీ అకాడమీ, అధికార భాషా సంఘం లాంటి కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గౌరవించారని, అయితే ఎన్ టి ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం పై తాను చాలా బాధపడుతున్నట్లు తెలిపారు. వైఎస్సార్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు కానీ ఎన్ టి ఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్నారని, ఆ సమయంలో సహాయం కోసం తాను వైఎస్సార్ దగ్గరకు వెళ్తే సహాయం చేశారన్నారు. ఆ కేసులో తనపై ఒత్తిడి వచ్చినా వైఎస్సార్ లొంగలేదని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రాబునాయుడు పై తనది సైద్ధాంతిక విరోధమే తప్ప వేరే ఏమీ లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa