ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రమణ దీక్షితులు వర్సెస్ టీటీడీ అర్చకులు అన్నట్లుగా వార్ కొనసాగుతోంది. ఇదిలావుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నిరాశపరచిందన్న తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ట్వీట్పై తిరుమల అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన చేసిన ట్వీట్పై అర్చకులు మండిపడ్డారు. ఈ మేరకు రమణ దీక్షితులు పోస్ట్ చేసిన ట్వీట్పై తిరుమలలోనే అర్చకులు ఏకంగా మీడియా సమావేశాన్నే ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రమణ దీక్షితులుపై అర్చకులు ఘాటు విమర్శలు చేశారు. రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారంటూ వారు ఆరోపించారు. రమణ దీక్షితులు చెబుతున్న ఏకసభ్య కమిటీ సిఫారసు చేసిన అంశాలేమిటో ఎవరికీ తెలియవన్నారు. బయటి విషయాలను తామేమీ పట్టించుకోవడం లేదని, స్వామి వారి కైంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎలాంటి అవరోధాలు ఎదురు కావడం లేదని కూడా వారు వెల్లడించారు.
తిరుమలలో అర్చక వ్యవస్థ సంతృప్తికరంగానే ఉందని అర్చకులు వెల్లడించారు. అర్చకులను 112 సెక్షన్ ప్రకారం క్రమబద్ధీకరించారని తెలిపారు. తమ పిల్లలకు కూడా శ్రీవారి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారన్నారు. కమిటీ నివేదిక ప్రకారం మిరాశీలను ఉద్యోగులుగా తీసుకున్నారన్నారు. 1997 నుంచి సంభావన అర్చకులుగా పనిచేస్తున్నారన్నారు. నిబంధనల మేరకే తమకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయని అర్చకులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa