భారత్ భిన్నత్వంలో ఏకత్వం అన్నది మరో సారి రుజువైంది. ఇలాంటి ఘటనలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. ఇకపై కూడా ఉంటాయి. దసరా పండుగ హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. జరుపుకునే విధానాలు వేరైనా.. చాలా రాష్ట్రాల్లో నవరాత్రుల అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇప్పటికే ఈ సందడి మొదలైపోయింది. కోల్కతాలో దసరా కోలాహాలం మామూలుగా లేదు. ప్రతి వీధిలోని దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల దగ్గర గర్బా డ్యాన్స్తో మహిళలు అదరగొడుతున్నారు.
ఈ తరుణంలో మతసామరస్యానికి అద్దం పట్టే ఓ ఘటన గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. కోల్కతాలో ఒకే ఒక కుటుంబం కోసం.. ముస్లింలు ఎక్కువగా ఉండే వీధిలో దుర్గాపూజ నిర్వహిస్తారు. అలీముద్దీన్ స్ట్రీట్లోని 13/A షరీఫ్ లైన్లో ఏకైక హిందూ కుటుంబం నివసిస్తుంది. ఆ ఒకే ఒక హిందూ కుటుంబం కోసం అక్కడ ముస్లింలు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. నిజానికి గత ఏడాది నుంచే ఈ సంప్రదాయాన్ని మొదలు పెట్టారు.
నిజానికి అక్కడ చాలా హిందూ కుటుంబాలు ఉండేవి. కానీ పోను పోను అక్కడ నుంచి హిందూ కుటుంబాలు వెళ్లిపోయాయి. ప్రస్తుతం అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. సయంత సేన్ అనే ఒకే ఒక హిందూ బెంగాలీ కుటుంబం మాత్రమే అక్కడ నివసిస్తుంది. పెద్దగా హిందువులు ఎవరూ లేకపోవడంతో 16 ఏళ్ల నుంచి దుర్గాపూజ వేడుకలను నిర్వహించడం లేదు. కానీ గత ఏడాది అక్కడున్న ముస్లిం యువకులు తమ వీధిలో దుర్గాపూజను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో హిందూ కుటుంబం ఎంతగానో ఆనందపడుతుంది.
తమ కాలనీలో నవరాత్రి ఉత్సవాలు మళ్లీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని సయంత సేన్ కుటుంబం అంటుంది. అసలు ఆ వీధిలో ఎప్పుడో నవరాత్రి వేడుకలు ఆగిపోయాయని, దశాబ్దాల నాటి సంప్రదాయాన్ని ముస్లింలు మళ్లీ పునరుద్ధరించడం ఎంతో ఆనందంగా ఉందని సయంత సేన్ చెప్పారు. దీనిపై అక్కడి ముస్లింలు కూడా స్పందించారు. వీధిలో దుర్గా పూజ జరగక్కపోవడంతో.. హిందూ కుటుంబ వాసులు కలత చెందారని ముస్లిం వ్యక్తి తౌసాఫ్ రెహమాన్ అన్నారు.
గత ఏడాది సేన్ కుటుంబం తమను సంప్రదించడంతో మళ్లీ ఇక్కడ ఆ వేడుకలను చేయాలని నిర్ణయం తీసుకున్నామని రెహమాన్ చెప్పారు. తామంతా పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని, మిగతా ఆచారాలను సేన్ కుటుంబం నిర్వహిస్తోందని అన్నారు. "ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలోని ఏకైక హిందూ కుటుంబం హక్కుల గురించి కూడా మనం ఆలోచించాలి" అని 2021లో పూజను ప్రారంభించిన రెహమాన్ అన్నారు. ఇలా ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవడం.. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. కాగా ఒడిశాలో 30 ఏళ్లుగా ముస్లిం మతానికి చెందిన వ్యక్తే నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa