ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోస్తాంధ్రతో పాటు సీమలో భారీ వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 04:10 PM

కోస్తాంధ‌్ర జిల్లాలతోపాటు రాయలసీమకు భారీ వర్ష సూచన అందింది.  ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని వాతావరణశాఖ తెలిపింది. కానీ కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.


రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాక తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ వర్షాలతో పాటూ పిడుగులు పడి పలువురు చనిపోయారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లముడిలో ఓ వ్యక్తి పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయాడు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో పొలంలో పనిచేస్తుండగా పిడుగుపడటంతో రైతు చంద్రశేఖర్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యవరంలో రైతు ఆంజనేయులు కూడా పిడుగు పడటంతో ప్రాణాలు కోల్పోయాడు.


మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మరికొన్న ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటూ పలు జిల్లాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. బుధవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa