ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త కూలి పనైనా చేసి డబ్బు సంపాదించాలి: సుప్రీం కోర్టు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 06, 2022, 04:19 PM

 


విడిపోయిన భార్య, మైనర్ బిడ్డల భరణం నిమిత్తం భర్త కూలి పనైనా చేసి డబ్బు సంపాదించాలని సుప్రీంకోర్టులో జస్టిస్ దినేశ్ మహేశ్వరి, బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఓ కుటుంబ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అది అతడి ధర్మం అని స్పష్టం చేసింది. ఈ బాధ్యతల నుంచి అతడి తప్పించుకోజాలడని పేర్కొంది. వ్యాపారం మూతపడినందున భార్యాబిడ్డలకు ఏమీ ఇవ్వలేనంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఆ వ్యక్తి పిటిషన్ ను తిరస్కరించింది. 


"శారీరకంగా ఎలాంటి లోపాలు లేనప్పుడు డబ్బు సంపాదించడం అనేది భర్త కర్తవ్యం. గతంలో ఫ్యామిలీ కోర్టు ముందుకు వచ్చిన ఈ కేసులో భర్త తన భార్యను, మైనర్ కుమారుడ్ని నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి పనిచేసి సంపాదించడానికి తగిన వనరులు ఉన్నాయని కోర్టు నమ్ముతోంది. కానీ భార్యాబిడ్డల పోషణలో అతడు విఫలమయ్యాడు" అంటూ ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు, ప్రతి నెలా భార్యకు రూ.10 వేలు, మైనర్ కుమారుడికి రూ.6 వేలు చొప్పున పోషణ నిమిత్తం ఇవ్వాలని ఆ వ్యక్తిని ఆదేశించింది. మెట్టినింటిని వదిలేసిన మహిళ తన చిన్న పిల్లలతో సొంతంగా జీవనం సాగించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత భర్తపై ఉంటుందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa