ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయానికి నాణ్యతతో కూడిన విద్యుత్ ఇవ్వండి: వై.ఎస్.జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 12:00 AM

వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని అధికార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. వచ్చే వేసవిలో విద్యుత్ కొరత లేకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అవసరమైన బొగ్గును సమకూర్చుకోవాలని సూచించారు. ఇంధన శాఖపై సీఎం జగన్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న నేపథ్యంలో దేశీయంగానే వీటిని సమకూర్చుకొనేలా తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.


ఇక విద్యుత్‌ డిమాండ్‌, కొనుగోళ్లు, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి టారిఫ్‌ తదితర అంశాలపై డేటా అనలిటిక్స్‌ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. కచ్చితమైన డిమాండ్‌ను తెలుసుకునేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) విధానాన్ని ఉపయోగించుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే అంశంపై సీఎం జగన్ ఆరా తీశారు. మీటర్లు పెట్టుకొనేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలన్నారు. ఈ విషయంలో అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్నారు. పంపుసెట్లకు మీటర్లపై రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని.. దీని వల్ల కలిగే ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలని పేర్కొన్నారు.


మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని.. దీనివల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందని సీఎం జగన్ చెప్పారు. రైతులకు ఒక్కపైసా ఖర్చు లేకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లు బిగిస్తాయన్నారు. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని చెప్పారు. అక్కడి నుంచి ఆ డబ్బు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుందని సీఎం జగన్‌ వివరించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa