ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తి రేపుతున్న ఆ షో...చంద్రబాబుతో బాలకృష్ణ ఇంటర్వ్యూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 11:59 PM

వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఇరువురిదీ చెరగని ముద్ర. జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపిన నేతలు. రాజకీయంగా వీరిద్దరి మధ్య ఎలాంటి వైరం ఉందో.. తొలినాళ్లలో ఇద్దరి మధ్య అంతటి స్నేహం ఉంది. ఇరువురూ మంచి స్నేహితులు. ఇంచుమించుగా ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఇరువురూ కాంగ్రెస్ పార్టీ నుంచే తమ రాజకీయ జీవితం ప్రారంభించారు. ఈ ఇరువురు నేతల మధ్య స్నేహం మరోసారి చర్చనీయాంశమైంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ షోనే అందుక్కారణం. ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారం అవుతున్న ఈ రియాల్టీ షో సీజన్ 2 ప్రోమో మంగళవారం విడుదలైంది. ఈ కార్యక్రమానికి ఈసారి గెస్ట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారు. ఈ షో వేదికగా ఆసక్తికర వివరాలు పంచుకున్నారు.


కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్లలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి స్నేహితులుగా ఉండేవాళ్లు. ఇరువురం కలిసి ఒకే గదిలో నిద్రించిన సందర్భాలు అనేకం ఉన్నాయని చంద్రబాబు నాయుడు గతంలో పలుమార్లు తెలిపారు. అందుకే ‘మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?’ అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు నాయుడు.. గుక్కతిప్పుకోకుండా ‘వైఎస్ రాజశేఖరరెడ్డి’ బదులిచ్చారు.


గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ చంద్రబాబు, వైఎస్సార్‌తో తన స్నేహం గురించి ప్రస్తావించారు. ‘రాజశేఖర్‌ రెడ్డి, నేనూ బెస్ట్ ఫ్రెండ్స్. మేమిద్దరమూ ఒకే గదిలో పడుకునేవాళ్లం. మేము ఎంత క్లోజ్‌గా ఉండేవాళ్లమో.. 1977, 83 సంవత్సరంలో ఉన్న నేతలకు తెలుసు. ఈ విషయం మీకు కూడా తెలుసు. రాజకీయంగా కలిసి పోరాడాము. తను కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నేను టీడీపీలోకి వచ్చాను. రాజశేఖరరెడ్డికి, నాకు మధ్య రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగతంగా విరోధం లేదు’ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మాటలకు సీఎం జగన్ నవ్వులు చిందించారు.


తన కాలేజీ రోజుల్లోని జ్ఞాపకాలను కూడా ఈ షో వేదికగా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. ‘మీ జీవితంలో మీరు చేసిన రొమాంటిక్‌ పనేంటి?’ అని బాలకృష్ణ అడగ్గా.. ‘మీరు సినిమాల్లో చేసిన రొమాన్స్ కంటే నేను స్టూడెంట్‌గా ఎక్కువే చేశాను’ అంటూ చంద్రబాబు బదులిచ్చారు. అమ్మాయిలు కనపిస్తే.. బైక్‌ సైలెన్సర్‌ తీసేవాడినని చెప్పారు. అల్లరి బాగానే చేశారంటూ బాలయ్య అనడంతో షోలో నవ్వులు విరిశాయి.


‘మీ జీవితంలో మీరు తీసుకున్న హార్డ్ డెసిషన్ ఏది?’ అని బాలకృష్ణ ప్రశ్నించడంతో అప్పటిదాకా సరదాగా సాగుతున్న షో కాస్త సీరియస్‌గా మారిపోయింది. 1995లో ఎన్టీఆర్ చేతుల్లోంచి అధికార బదిలీ గురించి ప్రస్తావించారు. ‘ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా?’ అంటూ బాలకృష్ణను చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఆయణ్ని కాళ్లు పట్టుకుని అడిగాను’ అంటూ నాటి ఘటన గురించి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నారా లోకేశ్ రాకతో షోలో మళ్లీ సందడి నెలకొంది. లోకేశ్ కాసేపు హోస్ట్‌గా మారి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడి వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను రాబట్టారు.


ఇక ఈ షో ప్రారంభంలో చంద్రబాబు నాయుడు గురించి ఇంట్రడక్షన్ చెబుతూనే బాలకృష్ణ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపారు. ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2 తొలి షోకు నా బంధువులను ఇంటర్వ్యూకు ఆహ్వానిద్దామనుకున్నా. మీ అందరికి బాబు గారు.. నాకు బావగారు అయిన చంద్రబాబు గారిని పిలిచా’ అంటూ బాలకృష్ణ ఆసక్తి రేపారు. సీజ‌న్‌-2లో తొలి కార్యక్రమం శుక్రవారం (అక్టోబర్ 14) ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో గంటల వ్యవధిలోనే 1 మిలియన్ వ్యూయర్‌షిప్‌తో క్రాస్ చేసి దుమ్ము రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa