ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమా దంపతులు పేర్లపై రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 11:58 PM

భూమా దంపతులు పేర్లపై రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని భూమా కిశోర్ రెడ్డిని భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి  హెచ్చరించారు. ఒకప్పుడు కిషోర్ రెడ్డి స్థాయి ఏంటో గుర్తు తెచ్చుకుంటే మంచిదని.. భూమా నాగిరెడ్డి ఆస్తులు తింటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలావుంటే 


నంద్యాల జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆళ్లగడ్డలో భూమా కుటుంబంలో వార్ మొదలైంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి విమర్శలు చేశారు. సొంత తల్లిదండ్రులపై చీటింగ్ కేసు పెట్టించారంటూ విమర్శలు చేశారు. వారసులంటే తల్లిదండ్రుల పరువు నిలబెట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే భూమా కిషోర్ రెడ్డి వ్యాఖ్యలకు భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


తన తల్లిదండ్రులపై తప్పుడు కేసు పెట్టినట్లు నిరూపిస్తే.. కిషోర్ రెడ్డి చెప్పినట్లు చేస్తానన్నారు. ఆయన నిరూపించలేకపోతే భూమా ఘాట్ దగ్గర వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని సవాల్ చేశారు. భూమా నాగిరెడ్డి ఆస్తులు వేలంలొ కొంటాం అని కిషోర్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని.. కిషోర్ రెడ్డి తన తల్లిదండ్రుల పేర్లు రాజకీయాల కోసం వాడుకుంటున్నాడన్నారని విమర్శించారు. కిషోర్ రెడ్డి వైసీపీతో కలిసి పనిచేస్తున్నారని.. ఆ నోటీసులు ఎందుకు వచ్చాయో తెలియదా అన్నారు. భూమా పిల్లల్ని ఎదుర్కోవాలని కాలేజ్ ఫ్రెండ్ ఎమ్మెల్యేతో కలిసిపోయారా.. కిషోర్ రెడ్డి బీజేపీ టికెట్ వస్తుందా అని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఆయన భూమా అఖిలప్రియ కాలి గోటికి కూడా సరిపోరన్నారు.


భూమా కిషోర్ గంగుల కుటుంబం తో కలిసి పని చేస్తున్నాడని.. ఇంతవరకు ఒక్కరిని కూడా వైఎస్సార్‌సీపీ నుంచి బీజేపీలోకి చేర్చుకోలేక పోయారని విమర్శించారు. భూమా కిషోర్ రెడ్డి వల్లే శోభానాగిరెడ్డి చనిపోయిందని తన తండ్రి చాలా సందర్భాలలో చెప్పారని ఆరోపించారు. బీజేపీ నుంచి ఆళ్లగడ్డలో పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి భూమా కిషోర్ రెడ్డిదని ఎద్దేవా చేశారు. ఇక ఎప్పటికైనా భూమా నాగిరెడ్డి వారసురాలు భూమా అఖిలప్రియ మాత్రమేనని జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నారు.


మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. భూమా కార్యకర్తలు ఎవరి వల్ల ఇబ్బందిపడుతున్నారో అందరికి తెలుసన్నారు. ఇన్ని రోజులు ఆళ్లగడ్డలో మూడో జెండా కనిపించిందా అని ప్రశ్నించారు. కుటుంబ విలువలు గురించి ఆయన తమకు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని.. ఆయన తన మొహాన్ని అద్దంలో చూసుకోవాలని సెటైర్లు పేల్చారు. తల్లిని కిషోర్ రెడ్డి ఇంట్లో నుంచి తరిమేస్తే.. తన తండ్రి నాగిరెడ్డి ఇంటికి తీసుకొచ్చి.. ఆమెకు ఆస్తులు ఇచ్చి గౌరవం ఇచ్చారన్నారు. గతంలో భూమి నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి పేరు మీద లోన్‌లు ఉన్నాయని.. ఎన్పీఏ దగ్గరకు వస్తున్నాయని లోన్ రెన్యూవల్ పేపర్ మీద సంతకం పెట్టమని కిషోర్ రెడ్డిని అడిగితే అప్పుడు ఏమని మాట్లాడారో ఆయనకు తెలియదా అన్నారు.


తమను రోడ్డు మీదకు లాగుతా.. భూమా నాగిరెడ్డి ఆస్తుల్ని వేలంలో కొంటాను అనలేదా అంటూ ప్రశ్నించారు. భూమా దంపతులు పేర్లపై రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకప్పుడు కిషోర్ రెడ్డి స్థాయి ఏంటో గుర్తు తెచ్చుకుంటే మంచిదని.. భూమా నాగిరెడ్డి ఆస్తులు తింటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. భూమా నాగిరెడ్డి వారసునిగా చెబుతున్నా.. ఒక్క సెంటు కూడా దక్కనివ్వను అన్నారు. భూమా నాగిరెడ్డి గ్రూపును అభిమానులను నిలబెట్టుకోవడం కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతాను అన్నారు. స్వార్ధ రాజకీయాలు మానుకోవాలని.. తమ ఆస్తులు కొట్టేసి తమపైనే నిందలా అంటూ మండిపడ్డారు. తమ ఆస్తులతో ఎంజాయ్ చేస్తున్న ఆయన తమ గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa