అసత్య ప్రచారాలతో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఇటీవల విశాఖపట్నంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 15న విశాఖలో పవన్ కల్యాణ్ పర్యటన తర్వాత పరిణామాలపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. కొందరి సామాజిక మాధ్యమాల అకౌంట్లను, వ్యక్తులను గుర్తిస్తున్నామని వెల్లడించారు. పోలీసులపై జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని స్పష్టం చేశారు.
కుట్ర ప్రకారమే ఎయిర్ పోర్టులో దాడి జరిగినట్టు విచారణలో తేలిందని సీపీ చెప్పారు. మంత్రి రోజాపై దాడి చేయాలనుకున్నారు గానీ, ఆమె పీఏకు గాయమైందని తెలిపారు. ఆ రోజున విశాఖలో పవన్ పర్యటనకు అనుమతి ఉంది కానీ, ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. డీజే, భారీ జనసమీకరణ, డ్రోన్ల వినియోగానికి అనుమతి లేదని వివరించారు. ర్యాలీకి అనుమతి లేదని, విరమించుకోవాలని కోరితే వినలేదని సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. విశాఖలో నాలుగు గంటల పాటు రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయిందని, విమాన ప్రయాణికులు, సామాన్యులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని తెలిపారు. పెందుర్తి సీఐ గాయపడ్డారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని అన్నారు. ఈ ఘటనపై 6 వేర్వేరు కేసులు నమోదు చేశామని, 100 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa