ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడున్నర సంవత్సరాల తరువాత గుర్తుకురావడం ఆశ్చర్యంగా ఉంది: అయ్యన్న పాత్రుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 08:44 PM

మూడున్నర సంవత్సరాల తరువాత జగన్ కు బీసీలు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. బీసీలపై జగన్ చూపిస్తున్న కపట ప్రేమ మానాలని ఆయన హితవు పలికారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ బీసీలను ఉద్ధరించామని చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు. బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలు అని అయ్యన్న ఉద్ఘాటించారు.  జగన్ రెడ్డి కుటుంబమంతా బీసీల శవాలమీదే బతుకుతూ వచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


"మంగంపేట బెరైటీస్ గనులను స్వాధీనం చేసుకోవడానికి బీసీ వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్యను చంపింది వైఎస్ రాజారెడ్డి కాదా? గనులను రాజారెడ్డి ఆక్రమించుకొని స్వాధీనం చేసుకోగా నేడు జగన్ అనుభవిస్తున్న విషయం వాస్తవం కాదా? బీసీల ఆస్తులపై బతికే జగన్ రాజీనామా చేయాలి. 


పేరుకు మాత్రం బీసీలకు పదవులు ఇచ్చి పెత్తనమంతా రెడ్లకు ఇచ్చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఒక్కో ప్రాంతానికి ఒక్కో సామంతరాజును పెట్టారు. రాష్ట్రంలో రెడ్డి పెత్తనం సాగుతోంది. ఉత్తరాంధ్ర సామంతరాజుగా మొన్నటి వరకు విజయసాయిరెడ్డి ఉండగా నేడు వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. గోదావరి జిల్లాలకు మిథున్ రెడ్డి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సామంతరాజుగా రామిరెడ్డి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు సామంతరాజుగా ప్రతాపరెడ్డి, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు సామంతులుగా సజ్జల రామకృష్ణారెడ్డిలను పెట్టారు. వీరిని రాష్ట్రాన్ని దోచుకోమని చెబుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతున్నారు. వెధవ పనులు చేసి పతివ్రతా శిరోమణుల్లా మాట్లాడుతున్నారు. 


వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఏం న్యాయం చేసిందో దమ్ముంటే చర్చకు రావాలి. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు సీఎం వద్ద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ నిధులు రూ.36 వేల కోట్లు దారిమళ్లించింది. టీడీపీకి బీసీలు మద్దతిస్తుంటే, బీసీలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు.  ఎన్టీరామారావు హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దాన్ని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 10 శాతం తగ్గించి 24 శాతానికి తెచ్చారు. దీంతో సుమారు 16,800 మంది బీసీలకు పదవులు లేకుండా పోయాయి. 981 నామినేటెడ్ పదవుల్లో 742 పోస్టులు రెడ్లకు ఇచ్చారు. మిగతా కులస్తులేమయ్యారు? 76 శాతం రెడ్లకిచ్చారు. బీసీల్లో ఆరుగురికి మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. ఇది అన్యాయం చేయడం కాదా? 


తిరుపతి తిరుమల దేవస్థానంలో 36 పోస్టుల్లో 11 మంది రెడ్లే. ముగ్గురు మాత్రం బీసీలు, వైస్ ఛాన్సలర్ లు 12 మంది ఉంటే, 10 పోస్టులు రెడ్లకు ఇచ్చారు. ఒక పోస్టు బీసీలకు ఇచ్చారు. 42 మంది సలహదారుల్లో 35 మంది రెడ్లే ఉన్నారు. ఒక్కరు మాత్రమే బీసీలున్నారు. విప్ లలోనూ ఒక్కరే.  బీసీలున్న ప్రాంతాల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోంది. బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టకపోతే బీసీలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. బీసీల నాయకులు ప్రాంతాలవారీగా ఐక్యంగా పోరాడాలి" అని పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు బీసీలకు పిలుపునిచ్చారు.


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa