గత కొంత కాలంగా రూటు మార్చిన ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్లో వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, శనివారం అనంత్నాగ్లోని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వలసకూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రఖ్-మోమిన్ ప్రాంతంలో జరిగిన ఘటనలో గాయపడిన ఇద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత రఖ్-మోమిన్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పది రోజుల కిందట ఇదే జిల్లాలో ఇద్దరు వలసకూలీలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
తాజా ఘటనలో గాయపడిన ఇద్దరిలో ఒకరిది బిహార్.. ఇంకొకరిది నేపాల్గా గుర్తించారు. ప్రసాద్, గోవింద్ అనే ఈ ఇద్దరూ బొందియాల్గామ్లోని ఓ ప్రయివేట్ పాఠశాలలో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల పంథా మార్చిన ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్లు, స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత నెలలో ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఇద్దరు వలసకూలీలు సోఫియాన్ జిల్లాలో ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారు. వీరు స్థానిక యాపిల్ తోటలో పనిచేయడానికి యూపీ నుంచి వచ్చారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో స్థానికేతరుల రాక క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భయాందోళనలు కలిగించేందుకు ఉగ్రవాదులు ఈ చర్యలకు పాల్పడుతున్నారు.
ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకుని ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారని అధికారులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాద నేరాలను అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, అనుమానితుల కదలికలను నిశితంగా గమనిస్తున్నామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa