ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రఘురామకృష్ణం రాజు ఇలాకాలో సీఎం వై.ఎస్.జగన్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 20, 2022, 12:37 PM

వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు  ఎపుడూ వ్యతిరేకంగా గళమెత్తుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం పర్యటనకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నర్సాపురం వెళుతున్నారు. దీంతో ఈ పర్యటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా వైసీపీ తరపున రఘురామకృష్ణంరాజు గెలవగా.. ఆ తర్వాత ఆయన వైసీపీకి వ్యతిరేకంగా మారారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వైసీపీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో రఘురామకృష్ణంరాజు నియోజకవర్గంలో జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.


సోమవారం నర్సాపురం పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు జగన్ నర్సాపురం చేరుకుంటారు. ఉదయం 11.14 నుంచి 12.50 గంటల వరకు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం నర్సాపురంలో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరి 2 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.


రఘురామకృష్ణం రాజు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా ప్రశ్నిస్తుండటం, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో తొలిసారి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో స్థానిక వైసీపీ నేతలతో జగన్ మాట్లాడే అవకశముందని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణంరాజుని ఓడించేందుకు వైసీపీ కసరత్తులు చేస్తోంది. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది.


రఘురామకృష్ణంరాజుకి పోటీగా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై పలువురి పేర్లను పరిశీలిస్తోంది. గోకరాజు గంగరాజు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవీజీకే భాను పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలించినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఇఫ్పుడు మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు పేరు కొత్తగా రేసులోకి వినిపిస్తోంది. దీంతో జగన్ పర్యటనతో నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎవరనేది మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa