ముంబయిలో ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో జరిగిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026' సదస్సులో ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా, గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పేర్లతో తాను నిర్వహిస్తున్న 'రెడ్ బుక్'లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ఉందో లేదో త్వరలోనే తెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను, సాధారణ ప్రజలను అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారని లోకేశ్ ఆరోపించారు.చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, వారిని ప్రోత్సహించిన రాజకీయ నాయకులు, చిత్రహింసలకు గురిచేసిన వారి పేర్లను రెడ్ బుక్లో నమోదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. అయితే, ఈ జాబితాలో జగన్ పేరు ఉందా లేదా అనే విషయంపై ఉత్కంఠ రేపుతూ, ఆ విషయం త్వరలోనే తేలుతుందని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు గురించి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక 'టఫ్ టాస్క్మాస్టర్' అని, 10 కిలోలు ఎత్తగలిగితే 14 కిలోల లక్ష్యం నిర్దేశిస్తారని, అది సాధిస్తే 18 కిలోల బరువు మోయమంటారని, దీనికి అంతం ఉండదని అన్నారు. ఆయన ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయడమే తమ పని అని తెలిపారు. 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తారని, ఆయన టేబుల్ వద్దకు తీసుకొచ్చే శక్తి అమోఘమని ప్రశంసించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఒక మీటింగ్లో చంద్రబాబు అడిగినప్పుడు, స్టాన్ఫోర్డ్ ఎంబీఏ చదివినా నాకు దానిపై అవగాహన లేదు. నేను టేబుల్ కింద ఫోన్లో చాట్జీపీటీలో వెతుక్కోవాల్సి వచ్చింది. ఆయన ఆలోచనలను అందుకోవడం చాలా కష్టం" అని లోకేశ్ సరదాగా వ్యాఖ్యానించారు.తిరుమల లడ్డూ ప్రసాదం అంశాన్ని లోకేశ్ తీవ్రంగా పరిగణించారు. 2019-24 మధ్య లడ్డూ తయారీలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, రసాయనాలు వాడారని అంగీకరించారు. జగన్ హయాంలో జరిగిన ఈ అపచారానికి, రాష్ట్ర మంత్రిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. లడ్డూ ప్రసాదంతో భక్తులకు ఉన్న భావోద్వేగ బంధాన్ని గుర్తుచేశారు. ఈ కల్తీకి బాధ్యులైన వారిని, సిట్ నివేదిక ప్రకారం మాజీ టీటీడీ ఛైర్మన్తో సహా ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేయడానికి ఎవరైనా వెయ్యి సార్లు ఆలోచించేలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావం గురించి మాట్లాడుతూ, 11 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా దూరంగా ఉంచాలని, 16 ఏళ్లలోపు వారికి వయసుకు తగిన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండాలని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. దీనిపై 90 రోజుల్లో బలమైన ఫ్రేమ్వర్క్ను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇక జాతీయ అంశాలపై స్పందిస్తూ, ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. తాము ఎప్పుడూ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను స్వాగతించామే తప్ప, గత ప్రభుత్వాల మాదిరిగా అడ్డుకోలేదని స్పష్టం చేశారు. యూఎస్ ట్రేడ్ డీల్ గందరగోళ సమయంలో సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని ఆక్వా రైతులకు అండగా నిలిచామని, కొత్త మార్కెట్లను అన్వేషించామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa