కేసులు విషయంలో వివిధ దేశాల ప్రముఖులపై సాగే విచారణ నుంచి అమెరికా కొన్ని మినహాయింపులు ఇస్తూ వస్తోంది. తాజాగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కు మినహాయింపు ఇచ్చింది అమెరికా.. ఇదిలావుంటే భారత ప్రధాని నరేంద్రమోదీపై తమదేశంలో జరుగుతున్న విచారణ నుంచి రక్షణ కల్పించామంటూ అమెరికా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గీ హత్యకు సంబంధించిన అమెరికాలో నమోదైన కేసుల విచారణ నుంచి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కు బైడెన్ సర్కారు మినహాయింపు ఇచ్చింది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బైడెన్ యంత్రాంగం వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఘటనను ఉదహరిస్తూ.. ఆయనకు కూడా ఇలాంటి రక్షణే కల్పించినట్లు గుర్తుచేసింది.
యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. ప్రస్తుతం సౌదీ ప్రధాని హోదాలో ఉండటంతో ఆయనకు అమెరికాలో ఖషోగ్గీ హత్య కేసు విచారణ నుంచి రక్షణ లభించింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ శుక్రవారం మీడియాకు వివరణ ఇచ్చారు. ‘‘అమెరికా ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.. ఇలాంటి కేసులకు సంబంధించి ఇది సుదీర్ఘంగా, స్థిరంగా కొనసాగుతున్న ప్రక్రియ.. గతంలోనూ అనేక దేశాధినేతలకు ఇది వర్తించింది. ఉదాహరణకు.. 1993లో అప్పటి హైతీ అధ్యక్షుడు అరిస్టైడ్, 2001లో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే, 2014లో భారత ప్రధాని నరేంద్రమోదీ, 2018లో కాంగో అధ్యక్షుడు జోసఫ్ కబీలాకు కూడా ఇలాంటి మినహాయింపు లభించింది.. దేశాధినేతలు, విదేశాంగ మంత్రులకు ఈ తరహా రక్షణ కల్పిస్తూ వస్తున్నాం’’ అని వెల్లడించారు.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో గోద్రా అల్లర్లు చోటుచేసుకుని 1000 మందికిపైగా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ అల్లర్లను అడ్డుకోడానికి మోదీ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న ఆరోపిస్తూ ఆయన వీసాపై 2005లో నిషేధం విధించింది. అమెరికాతో పాటు యూకే, యూరోపియన్ యూనియన్ కూడా ఈ తరహా ఆంక్షలు విధించినా కొన్నాళ్ల తర్వాత వాటిని రద్దుచేశాయి. కానీ, అమెరికా మాత్రం 2014లో మోదీ భారత ప్రధాని అయ్యేంతవరకు ఆ నిషేధాన్ని కొనసాగించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఆంక్షలను తొలగించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa