పైలెెట్ అప్రమత్తత వల్ల లిమా వినాశ్రయంలో టెకాఫ్ సమయంలో ప్రయాణికుల ప్రాణాలు దక్కాయి. టేకాఫ్ సమయంలో ఊహించని విధంగా రన్వేపై ఉన్న ఫైర్ ఇంజిన్ను విమానం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన పెరూ రాజధాని లిమా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. టేకాఫ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విమానం వెనుక భాగం దెబ్బతినడంతో పెద్దఎత్తున పొగలు కమ్మేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారికి ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిలీకి చెందిన లాతమ్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్ 320 విమానం 102 మంది ప్రయాణికులతో లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జులియాకాకు బయలుదేరింది. ఈ క్రమంలో టేకాఫ్ కోసం రన్వేపై వేగంగా దూసుకెళ్తుండగా.. అంతలోనే ఓ అగ్నిమాపక వాహనం అడ్డుగా వచ్చింది. దీంతో వాహనాన్ని ఢీకొన్న తర్వాత అలాగే విమానం కొద్ది దూరం దూసుకెళ్లి నిలిచిపోయింది. ఈ ఘటనంలో విమానం వెనుక భాగంలో మంటలు చెలరేగి, పెద్దఎత్తున పొగలు వెలువడ్డాయి. ఫైర్ ఇంజిన్లోని ఇద్దరు సిబ్బంది మృతి చెందారు.
విమానంలో ప్రయాణికులు, సిబ్బందికి ప్రాణాపాయం తప్పిందని.. వారిలో 61 మందిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 20 మందికి చికిత్స అందించామని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పెరూ అధ్యక్షుడు పెడ్రో కాసిల్లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. దర్యాప్తునకు ఆదేశించారు.
మరోవైపు, విమానం టేకాఫ్ సమయంలో రన్వేపైకి అగ్నిమాపక వాహనం ఎందుకొచ్చిందో తెలియదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోడానికి దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో కుట్ర కోణం ఉందా? అనే దిశగానూ విచారణ కొనసాగుతోందని వివరించారు. తదుపరి నోటీసు వచ్చేవరకు ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను నిలిపేశారు. ఘటన సమయంలో బ్రెజిల్కు చెందిన ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
‘‘ఫైర్ ఇంజిన్ను ఢీకొట్టి విమానం ఆగిపోవడం చూసి డిపార్చర్ లాంజ్లో ఉన్న ప్రతి ఒక్కరం భయపడ్డాం.. ఆపై అగ్నిమాపక ఇంజన్లు, అంబులెన్స్లు వచ్చాయి’’ పనామా విమానం ఎక్కడానికి వేచి ఉన్న బ్రెజిల్ ప్రయాణికుడు మౌరో ఫెరీరా అన్నారు. ‘‘విమానం లోపల ఎంత మంది ఉన్నారో మాకు తెలియదు.. మంటలు చాలా ఎత్తున ఎగిసిపడ్డాయి’’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa