ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఒక విధంగా తమ నేత మనీశ్కు సీబీఐ, ఈడీ క్లీన్చిట్ ఇచ్చాయని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇదిలావుంటే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ శుక్రవారం తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటే.. ఈడీ మాత్రం కేవలం ఒక్కర్నే నిందితులుగా పేర్కొవడం గమనార్హం. రౌజ్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్కు సమర్పించిన ఛార్జ్షీట్లో ఇండో స్పిరిట్స్ లిమిటెడ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రును ఏ1గా చేర్చింది. సమీర్తో పాటు ఆయన నియంత్రణలో ఉన్న నాలుగు కంపెనీలను నిందితులుగా పేర్కొంది.
దాదాపు 3 వేల పేజీలున్న చార్జిషీటులో రూ.291 కోట్ల లావాదేవీలకు సంబంధించిన వివరాలను పొందుపరిచినట్లు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుతానికి సమీర్ మహేంద్రు పాత్రపై దర్యాప్తు పూర్తయిందని, మిగతావారు, ఇతర కంపెనీల పాత్ర, లావాదేవీలపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని ఈడీ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. త్వరలో వాటికి అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేస్తామని వివరించారు. అయితే, ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఏ1గా పేర్కొన్న ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియా పేరు ఇందులో లేకపోవడం గమనార్హం. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లోనూ సిసోడియా పేరు లేని విషయం తెలిసిందే.
ఇదిలావుంటే సమీర్ మహేంద్రు కంపెనీల ఉద్యోగులను విచారణ పేరిట ఈడీ అధికారులు పిలిచి హింసించారని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. దాంతో ఉద్యోగులు భయాందోళనతో ఉన్నారని, ఇప్పటివరకు దాదాపు 30 మంది రాజీనామా చేశారని తెలిపారు. కాగా, కేసులో ఏ1గా చేర్చిన సిసోడియా పేరు.. ఛార్జ్షీట్లలో లేకపోవడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేసును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, దీనిపై ఇటీవల సీబీఐ, ఈడీ డైరెక్టర్లను కలిశారని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన.. ఒక విధంగా మనీశ్కు సీబీఐ, ఈడీ క్లీన్చిట్ ఇచ్చాయని అన్నారు. అందుకు దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘మనీశ్ సిసోడియా పేరు ఈడీ ఛార్జ్షీట్లోనూ లేదు..విద్యా విప్లవం ద్వారా భారతదేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన మనీశ్ సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించినందుకు మోదీ దేశానికి క్షమాపణ ఎందుకు చెప్పకూడదు?’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలకు పాల్పడినట్టు కేసులు నమోదుచేసిన సీబీఐ, ఈడీలు.. దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలు నిర్వహించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసుకు సంబంధించి తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa