ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లిం దేవతలను ప్రార్థించే వారిలో సగానికి సగం మంది హిందువులే : అనిల్ కుమార్ యాదవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 02:07 PM

ముస్లిం దేవతలను ప్రార్థించే వారిలో సగానికి సగం మంది హిందువులే ఉన్నారన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించుకోవాలని నెల్లూరు సిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సూచించారు. అయ్యప్ప మాలలో ఉండి తానేదో నేరం, పాపం చేసినట్లు బీజేపీ, బీజేవైఎం నాయకులు ఓవరాక్షన్ చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తాను ముస్లిం కండువా కప్పుకోవడాన్ని తప్పుబడుతున్న బీజేపీ నేతలకు.. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకునే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వావర్ స్వామి ముస్లిం కాదా అని నిలదీశారు. కన్నెస్వాములందరూ వావర్ స్వామి ఉండే మసీదును దర్శించుకుంటారని.. ముస్లిం దేవతలను ప్రార్థించే వారిలో సగానికి సగం మంది హిందువులే ఉంటారని అనిల్ కుమార్ యాదవ్ వివరించారు.


ఈ అంశంలో సోము వీర్రాజు లాంటి బీజేపీ నేతలు కనీసం అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఈ విషయంలో తాను హిందువులను అవమానించినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తాను చేసింది తప్పుకాదని ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికైనా విజ్ఞతతో ఆరోపణలు చేస్తే మంచిదని హితవు పలికారు. అయ్యప్పమాలలో ఉన్నప్పుడు పరమతాన్ని గౌరవిస్తే తప్పేంటని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. కొన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వారు తన ఇంటి ముందు ఆందోళనలు చేయడం సిగ్గుచేటని చురకలంటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa