ఏపీని మళ్లీ వర్షాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతానికి తమిళనాడు వైపు కదులుతోందని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) స్పష్టం చేసింది.
ఏపీలో దిగువస్థాయి నుంచి తూర్పు, ఈశాన్య గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఇవి మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. అనంతరం పొడి వాతావరణం మొదలయ్యాక రాష్ట్రంలో చలి ప్రభావం అధికమవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. శనివారం తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇనుగుంటలో 7.6 సెం.మీల భారీ వర్షపాతం నమోదైంది.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతుంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచు దుప్పటి కప్పుకుంటుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాలు పొగమంచులోనే ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నల్లొండ, ఖమ్మం జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. ఏపీలోని అరకు, మన్యం ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకొని ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు పర్యటకుల తాకిడి పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa