ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం..కొత్త ఏడాదిలో ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 08:24 PM

జాతీయ పార్టీగా మారేందుకు బీఆర్ఎస్ వడివడిగా అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ కార్యకలాపాలను అన్ని రాష్ట్రాల్లో ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తోన్నారు. అందులో భాగంగా త్వరలోనే పొరుగు రాష్ట్రమైన ఏపీలో కార్యాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఏపీ బీఆర్ఎస్ వ్యవహారాలను చూసుకునే బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేసీఆర్ అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి ఏపీకి సంబంధించిన బీఆర్ఎస్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించనున్నారు.


ప్రస్తుతం ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయంను ప్రారంభించే పనులు జరుగుతోన్నాయి. అమరావతిలో ఒక కార్యాలయాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకుని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. జనవరిలో ఈ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించే అవకాశముంది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కోసం ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రకటించారు. 9491015222 అనే నెంబర్‌ను బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కోసం ఏర్పాటు చేశారు.


నెంబర్‌కు కాల్ చేసిన వారి వివరాలు సేకరించి పార్టీ సభ్యత్వం ఇవ్వనున్నారు. త్వరలో ఏపీకి చెందిన పలువురు నాయకులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశముంది. ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు వచ్చి ప్రగతిభవన్‌లో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్‌తో చర్చించనున్నారు. తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నవారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నవారికి ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించనున్నారు.


ఇప్పటికే ఏపీలోని పలు పార్టీలకు చెందిన నేతలు ఇటీవల ఢిల్లీ, హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి కనబర్చారు. బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తనతో కలిసి పనిచేసిన పలువురు మాజీ టీడీపీ నేతలకు కేసీఆర్ ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తనను వచ్చి కలవాల్సిందిగా వారిని కేసీఆర్ ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరిలో బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఏపీ రాజకీయ నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరనన్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో కూడా బీఆర్ఎస్ పోటీలోకి దిగనుందని తెలుస్తోంది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను ఎంచుకుని అక్కడ అభ్యర్థులను బరిలోకి దింపనుందని చెబుతున్నారు.


అలాగే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తోన్నారు. జనవరిలో నాందేడ్‌ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఈ నెల 27వ తేదీనే అక్కడ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే సభాస్థలికి సంబంధించి క్లారిటీ రాకపోవడంతో వెనక్కి తగ్గారు. ఈ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa