నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో (జీవో ఆర్.టీ.01) తెచ్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యంగ్యంగా అన్నారు. రోడ్లపై రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైసీపీ సర్కారు జీవో నెం.01 తీసుకురావడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ జీవోతో జగన్ ప్రజాస్వామ్య హంతకుడిగా మారాడని విమర్శించారు. కమ్ముకొస్తున్న ప్రజాగ్రహాన్ని కాలంచెల్లిన బ్రిటీష్ చట్టాలు, ఇలాంటి చీకటి జీవోలతో ఆపడం జగన్ రెడ్డి తరంకాదని అన్నారు.
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో (జీవో ఆర్.టీ.01) తెచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. బ్రిటీష్ పాలకులు అమలుచేసిన 1861 పోలీస్ యాక్ట్ ను ఆధారం చేసుకొని ప్రభుత్వం జీవో నెం.01 తీసుకొచ్చిందని వివరించారు. జగన్ రెడ్డి తీసుకొచ్చింది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు.
"జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదికే పత్రికలు, ఛానళ్లు, సోషల్ మీడియాపై విషం చిమ్ముతూ జీవో.2430ను తెచ్చి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మొట్టికాయలు తిన్నాడు. అయినా సిగ్గూశరం లేకుండా మరలా జీవో నెం.01 తో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తున్నాడు. తన పాలనలోని డొల్లతనం ప్రజలు గ్రహించి, ప్రతిపక్షనేత చంద్రబాబుని ఆదరిస్తున్నారన్న అక్కసుతోనే జగన్ రెడ్డి జీవో నెం.01 తీసుకొచ్చాడు.
జీవోఆర్.టీ.01 తీసుకురావడానికి గుంటూరు కందుకూరు ఘటనలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. ఆ రెండు దుర్ఘటనల వెనుక వైసీపీ కుట్రకోణం ఉందనే అనుమానాలున్నాయి. ప్రతిపక్షనేత కార్యక్రమాల్లో వైసీపీ వాళ్లే ఉద్దేశపూర్వకంగా అలజడి, తోపులాట సృష్టించారని మాకు అనుమానాలున్నాయి. ఆ రెండు దుర్ఘటలనపై సీబీఐతో లోతుగా విచారణ చేయించి, వాస్తవాలు బహిర్గతంచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa