ఇటీవల రోడ్ షోలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయం మహిళ పోలీస్ వ్యవస్థ పనితీరుపై, వారు చేస్తున్న సర్వేలపై అబద్దాలను ప్రచారం చేస్తూ వారికి సహకరించవద్దని ,వారు వస్తే తలుపులు వేసేయాలని, వారు ఇంటింటికి తిరిగి భార్య భర్తల సంబంధాలపై సర్వే చేస్తున్నారని ప్రజల్లో భ్రమ కలిగే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్. మహాలక్ష్మి అన్నారు. ఈమేరకు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను ఆమె కార్యాలయంలో గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం గ్రామస్థాయిలో మహిళా భద్రత విషయంలో పదిమందికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశంతో గ్రామస్థాయిలో సచివాలయ మహిళా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో సచివాలయం మహిళా పోలీసులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలు సచివాలయం మహిళా పోలీసులను తీవ్రంగా మనోవేదనకు గురి చేసిందని, ఏపి గ్రామ/వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జనరల్ సెక్రటరీ డి. మధులత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు దుర్గా, గౌస్యా బేగం, మంగళగిరి గీత తదితరులు వినతి పత్రం అందజేసినవారిలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa