ఇవాళ ప్రజాస్వామ్యంలో జరగరానివి జరుగుతున్నాయని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. జీవో నెం.1 తీసుకొచ్చిన తర్వాత కుప్పంలో చేసిన అరాచకాలపై సంఘీభావం తెలిపేందుకు పవన్ కల్యాణ్ ఇవాళ తన ఇంటికి వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. అందుకు పవన్ కల్యాణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వివరించారు. పవన్ కల్యాణ్ విశాఖ వెళితే వాహనంలోంచి దిగకూడదు, అభివాదం చేయకూడదు, రూమును వదిలి బయటకు రాకూడదు, ఇక్కడినుంచి మీరు వెళ్లిపోవాలి, ఇక్కడ ఉండడానికే వీల్లేదు అంటూ అనేక రకాల ఆంక్షలు విధించి హింసించారని తెలిపారు. ఇప్పటంలో సభకు ప్రభుత్వం స్థలం ఇవ్వకపోతే గ్రామస్తులే ఇచ్చారని, దాంతో అక్కడ కూల్చివేతలు చేపట్టారని చంద్రబాబు ఆరోపించారు. గ్రామస్తులకు సంఘీభావం తెలిపేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటం వెళితే... మీరు కారెక్కకూడదు, కార్లో తిరగకూడదు అంటూ ఎన్ని ఆంక్షలు పెట్టాలో అన్ని ఆంక్షలు పెట్టి వేధించారని చంద్రబాబు వెల్లడించారు. అదేమంటే, రోడ్డు విస్తరణకు ఇళ్లు కూలగొడుతున్నాం అని చెప్పారని విమర్శించారు.
"మొన్న కుప్పంలో జరిగిన ఘటన పరాకాష్ఠ. గతంలో నేను ఆత్మకూరు వెళ్లాలనుకున్నాను. అక్కడ కొన్ని వందల కుటుంబాలను వెలివేశారు. వాళ్లంతా చెల్లాచెదురైపోయారు. వాళ్లను మళ్లీ ఆత్మకూరు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తే... నేను బయటికి రాకుండా మా ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. నేను వైజాగ్ వెళితే వైసీపీ గూండాలతో గొడవ చేయించారు. శాంతిభద్రతల సమస్య ఉందంటూ పోలీసులు నన్ను అక్కడి నుంచి విమానంలో వెనక్కి పంపించేశారు.
తిరుపతి, చిత్తూరులో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా బెదిరిస్తున్నారు, బలవంతపు ఉపసంహరణలకు పాల్పడుతున్నారని తెలిసి వాటిని అడ్డుకుని, అభ్యర్థులకు ధైర్యం చెప్పేందుకు వెళితే... తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి నన్ను తిరిగి పంపించేశారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే రాళ్లతో, కర్రలతో దాడి చేస్తే... ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆనాటి డీజీపీ స్టేట్ మెంట్ ఇచ్చాడు... దానిపై ఎలా స్పందించాలో అర్థంకాదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa