ఎన్టీఆర్ ఆదర్శమైతే, ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారు అని చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరస్మరణీయ వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తుంచుకున్న ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు ఆయన పేరు పెట్టారన్నారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలతో అనేకమంది రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ తమకు ఆదర్శమంటూ నేడు కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
ఎన్టీఆర్ ఆదర్శమైతే, ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్టీఆర్ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టి కరిపించారన్నారు. ఎన్టీఆర్ పదవిని దొంగలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు నేటికీ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారన్నారు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జీవితం ఆదర్శం.. గుడివాడ నుంచి రెండుసార్లు అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa