ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నం పెట్టిన రైతన్నను ఆదుకునే వారెవరు ,,,మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 20, 2023, 05:45 PM

అన్నం పెట్టే రైతన్నను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, రైతులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని ఈ విషయమై ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలని గ్రేటర్ రాయలసీమ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తన కార్యాలయంలో గంగుల ప్రతాప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వెలుగోడు రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపి ఉంటే కేసి కెనాల్, తెలుగంగ కాలువల ఆయకట్టు రైతాంగానికి ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. కెసి కెనాల్ కింద నంద్యాల ఆళ్లగడ్డ అప్పటి కోవెలకుంట్ల తాలూకా ప్రాంతాల్లో 1,35,000 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. జనవరి సమయానికి కేసీ కెనాల్ లో నీరు లేక ఒట్టిపోవడం బాధాకరమన్నారు. రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుంది దేశం బాగుందని గంగుల అన్నారు. రెండు సంవత్సరాల కరోనా సమయంలో రైతన్న పండించిన పంటతోనే అన్నం మనకు దక్కిందన్నారు. రైతులు నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని ఆయన పాలకులకు హితవు పలికారు. నిరాశ నిస్పృహలతో దయనీయ స్థితిలో ఉన్న రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన అదృష్టం బాగుండి మంచి వర్షాలు కురవడంతో శ్రీశైలం రిజర్వాయర్  పూర్తిస్థాయిలో నీటితో నిండిందన్నారు. 16 టిఎంసిల సామర్ధ్యం గల వెలుగోడు రిజర్వాయర్ ను పూర్తిగా నింపకుండా ఏడు టిఎంసిల నీరు నింపితే అది ఎంతవరకు సరిపోతుందో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఇందుకు నిర్లక్ష్యమే కారణంగా తాను భావిస్తున్నానన్నారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరని ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కోణంలో నేను మాట్లాడడం లేదని, తప్పులు సరిదిద్దుకోవాలని తాను చెబుతున్నానన్నారు. రాయలసీమ ప్రాంతాలలోని సాగునీటి కాలువలు తెలుగు గంగ, కెసి కెనాల్, హంద్రీనీవా, గాలేరు నగరి లకు నీరు పుష్కలంగా అందాలంటే సిద్దేశ్వర నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఇన్నిసార్లు తాను సిద్దేశ్వరం ప్రాజెక్టు గురించి చెబుతున్నా ప్రభుత్వాలు గుర్తించకపోతే ఎలా అని ఆయన అన్నారు. శ్రీశైలం నుండి విద్యుత్ ఉత్పత్తి పేరుతో కెసిఆర్ నీళ్లు తీసుకెళ్లారని, మీరు కూడా విద్యుత్ ఉత్పత్తి పేరుతో మీరు వృధా చేశారన్నారు. ఖర్చు పేరుతో ధర్మల్ స్టేషన్లు మూసివేశారని నీరు లేకపోవడంతో మన ప్రాంత రైతులంతా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా తండ్రి దివంగత ఎమ్మెల్యే గంగుల తిమ్మారెడ్డి హయాంలో కూడా ఆయన రైతులకు సాగునీరు అందించేందుకు రాత్రింబవళ్లు శ్రమించాలన్నారు. ఆనాడు అన్ని అవకాశాలు లేవని, ఈనాడు అన్ని అవకాశాలు ఉన్నా ఉపయోగించుకోలేకపోవడం బాధాకరం అన్నారు. ఈ పరిణామాలను చూసి తాను సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. మన ప్రాంత రైతులకు న్యాయం జరిగే విషయంలో తాను కఠినంగా ఉంటానన్నారు. మన ప్రాంత సమస్యలు, మన ప్రాంత ప్రయోజనాలు కేంద్ర స్థాయికి తెలియచెప్పాలన్నదే తన ముఖ్య ప్రధాన్యత అని అందుకోసమే పార్లమెంటులో మన వాణి వినిపించడానికి తాను బరిలోకి దిగనున్నానని గంగుల ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa