ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇదిలావుంటే ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీ అగ్గిరాజేసింది. డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించగా.. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారులు ప్రత్యక్షం కావడం కలకలం రేగింది. ఐటీ అధికారులు సోదాలకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇది కేవలం సర్వే అని.. సోదాలు కాదని ఐటీ అధికారులు స్పష్టం చేశారు. పన్నుల అవకతవకల ఆరోపణలపై ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే కొందరు పాత్రికేయుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
‘‘ఆఫీస్లో ఆదాయపు పన్ను దాడులు జరుగుతున్నాయి.. అన్ని ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు’ అని ఏఎఫ్పీకి బీబీసీ తెలిపింది. పన్ను పత్రాల ధ్రువీకరించడానికి ఐటీ బృందం అక్కడికి చేరుకుందని, కొంతమంది ఉద్యోగులను కూడా కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లమని చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. దానిని తీవ్రంగా ఖండించిన కేంద్ర ప్రభుత్వం.. ఇదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది. విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ‘ఇది ఒక ప్రచార కార్యక్రమం. వారు ఎంచుకున్న కోణాన్నిప్రచారం చేయడానికి మాత్రమే దీనిని రూపొందించారు’ అని వ్యాఖ్యానించారు. కాగా, డాక్యుమెంటరీ వివాదంపై అమెరికా, బ్రిటన్లు తటస్థ వైఖరి అవలంభించాయి.
దేశవ్యాప్తంగా వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో డాక్యుమెంటరీని ప్రదర్శించినప్పటికీ సోషల్ మీడియా, ఆన్లైన్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తోన్న సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అలాగే, డాాక్యుమెంటరీని నిషేధించాలన్న పిటిషన్ను తిరస్కరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa