ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయటపడ్డ పురావస్తు శాసనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 16, 2023, 01:30 PM

ఉమ్మడి గుంటూరు జిల్లా, యడ్లపాడు మండల పరిధిలోని కొండవీడుకోటలో 13వ శతాబ్దం నాటి శాసనాలు వెలుగు చూశాయి. ఇటీవల కొండవీడుకోట నగరవనం అభివృద్ధిలో భాగంగా అటవీశాఖ అధికారులు పలు కార్యక్రమాలను చేపట్టారు. గతంలో గుప్త నిధులకోసం దుండగులు ధ్వంసం చేసిన ఓ గదిని పునఃనిర్మించేందుకు ఈ నెల 12న కొలతలు తీస్తుండగా 6 అడుగుల పొడవున్న ఓ రాతి స్తంబంపై ఉన్న శాసనాన్ని కొండవీడుకోట అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కల్లి శివారెడ్డి గుర్తించారు. శాసనాన్ని చిత్రీకరించి ఢిల్లీలోని పురావస్తుశాఖ డైరెక్టర్‌ మునిరత్నం రెడ్డికి పంపించారు. దానిని పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు 13వ శతాబ్దంలో తెలుగు లిపిలో చెక్కిన శాసనంగా దాన్ని గుర్తించారు. ఆ శాసనంలో మహా మాండలేశ్వర అప్రతిహ మల్ల యాదవ చోడ మహారాజులు కల్యాణమండపం నిర్మించినట్లుగా రాసివుందని తెలిపారు. కాగా బుధవారం మరో మూడు స్తంబాలపై చెక్కిన శాసనాలు బయల్పడగా వాటిని కూడా పురావస్తుశాఖ అధికారులకు పంపించారు. ఒక శాసనంలో విశ్వేశ్వర దేవరకు కల్యాణ మండపం నిర్మించింది గళాల పాతన తండ్రి బేతాచారికి తల్లి సింగసానికి పుణ్యంగా చేయించినట్లు రాసి ఉందని, రెండు, మూడు శాసనాలు చెక్కిన స్తంబాలు సగానికి పైగా పగిలిపోయి ఉన్నాయి. అయితే లభించిన సమాచారం ఆధారంగా తల్లిదండ్రుల పుణ్యం కోసం దేవునికి నిర్మాణం చేయడం, దానం ఇచ్చినట్లు వేయించిన శాసనం అని పురావస్తుశాఖ అధికారులు వెల్లడించినట్లు శివారెడ్డి తెలిపారు. కొండవీడుకోట కొండలపై 4 కి.మీల వైశాల్యంలో విస్తరించి ఉన్న మైదాన ప్రాంతంలో పురావస్తుశాఖ తవ్వకాలు నిర్వహిస్తే ఎంతో విలువైన సమాచారం లభించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పురావస్తుశాఖ ఈ విషయమై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని శివారెడ్డి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa