శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం జరిగింది. ఎనిమిదో రోజైన శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7.10 నుంచి 8.30 గంటల వరకు ఉభయ దేవేరులతో కూడి శ్రీవారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.
అనంతరం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.40 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.
శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం దగ్గర నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందుగా హరికథ పారాయణం జరిగింది. అనంతరం ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి రవిప్రభ బృందం నాదస్వరం, శ్రీ చంద్రశేఖర్ బృందం డోలు వాయిద్యాలతో మంగళధ్వని వినిపించారు.
అనంతరం శ్రీ మంద అనంత కృష్ణ – వేణువు, డా|| కె. వి.కృష్ణ వయోలిన్ , శ్రీ యం. సుధాకర్ మృదంగం, శ్రీ జి. నటరాజ ప్యాడ్స్, తబలపై వాయిద్య కచేరి నిర్వహించారు. ఇందులో లింగాష్టకం, గంగాదీశ్వరం, రారా వేణుగోపబాల, ఏమి సేతుర లింగ, మహాప్రాణ దీపం, తందనానా అహి, జయ జనార్ధన, మగుడి (నాగస్వరం) తదితర కీర్తనలను వాయిద్యాలపై పలికించారు.
అదేవిధంగా కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఎస్.ఉషారాణి నృత్య పర్యవేక్షణలో విద్యార్థినులు చక్కగా భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఇందులో తాండవ నృత్యకారి.., కాంచ దళయతాక్షి.. అర్ధనారీశ్వర, శివపాదం, లింగాష్టకం, శివ భజన, కావడి, తందనాన అహి, మోహిని భస్మాసుర కూచిపూడి యక్షగానం తదితర కీర్తనలకు చక్కగా నృత్యం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa