బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు అని తారకరత్న మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావోద్వేగంగా స్పందించారు. ఇదిలావుంటే సినీ నటుడు, టీడీపీ యువ నేత నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయారు. కాగా.. తారకరత్న మరణంపై పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే.. తారకరత్న జనవరి 26న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా గుండెపోటుకు గురికాగా.. 23 రోజుల తర్వాత ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తారకరత్న మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన నారా లోకేష్.. ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళులతో.." అంటూ బావోద్వేగంగా రాసుకొచ్చారు. తారకరత్న మృతితో యువగళం పాదయాత్రకు బ్రేకిచ్చారు. తారకరత్నకు నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైదరాబాద్ బయలుదేరనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa