ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నాయకులతో మరోసారి చర్చలు జరపనుంది. పీఆర్సీ పెండింగ్ అంశాలతో పాటు ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై 3 ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఏపీ జేఏసీ అమరావతి ఈ నెల 9వ తేదీ నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులను జగన్ ప్రభుత్వం అత్యవసరంగా చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో అనధికారిక చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు.. సచివాలయంలో మంత్రుల కమిటీతో భేటీ కానున్నారు.
ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ జేఏసీ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సంఘానికి ముగ్గురు ప్రతినిధుల చొప్పున చర్చలకు రావాలని కోరింది. ఇక, సూర్యనారాయణ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని మాత్రం ఈసారి చర్చలకు ఆహ్వానించలేదు.
మరోవైపు ఉద్యోగ సంఘాల ఆందోళపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. మంత్రులు, అధికారులతో నవరత్నాలు సహా ఇతర ప్రధాన పథకాలకు బడ్జెట్ కేటాయింపులపై సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలోనే ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనలపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa