ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు... సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 08:15 PM

కడప ఎంపీ వైఎస్ అవినాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమంది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని.. కోర్టుకు ఇచ్చిన ఆధారాలను సీబీఐకి తిరిగి ఇచ్చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి హైకోర్టు సూచించింది. విచారణను ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని కోర్టు ఆదేశించింది.. సీబీఐ విచారణ ప్రదేశానికి లాయర్‌ను అనుమతించలేమని స్పష్టం చేసింది. అవినాష్‌రెడ్డి వేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.


సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా చూడాలని.. తన విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు తనను 161 సీఆర్పీసీ కింద విచారించకుండా స్టే విధించాలని అవినాష్ రెడ్డి కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.. ఈ నెల 13 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ కూడా కోర్టులో తన వాదనలు వినిపించింది. హైకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి వీడియోగ్రఫీ, ఆడియోగ్రఫీ, కేసు వివరాలను షీల్డ్ కవర్‌లో సీబీఐ సమర్పించింది. ఇరువైపులా వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ పిటిషన్‌ను తోసిపుచ్చింది. మరోవైపు అవినాష్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే నాలుగుసార్లు పిలిపించి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డిని కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa