ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోనసులిచ్చి ఉద్యోగులను కాపాడుకునేందుకు.. యాపిల్ సంస్థ వినూత్న ప్రయత్నం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 10:25 PM

అన్ని కంపెనీలు ఉద్యోగులను తీసేస్తుంటే ఆపిల్ సంస్థ మాత్రం తన ఉద్యోగులను కాపాడుకునేందుకు వివిధ చర్యలు చేపట్టింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్.. ఇలా బడా టెక్ సంస్థలన్నీ ఉద్యోగులను భారీ స్థాయిలో తొలగించాయి. ఈ బాట పట్టని ఒకే ఒక సంస్థ యాపిల్. ఇప్పటివరకూ యాపిల్.. ఉద్యోగుల తొలగింపునకు పూనుకోలేదు. అయితే.. ఉద్యోగులను కాపాడుకునే క్రమంలో యాపిల్ విశ్వప్రయత్నమే చేస్తోంది. ఖర్చులను తగ్గించుకుంటూ దుబారా వ్యయాలకు కత్తెర వేస్తోంది. అంతేకాకుండా.. కొందరు ఉన్నతోద్యోగులకు బోనస్‌లు కూడా నిలిపివేసింది. కొత్త ఉద్యోగులను కూడా పరిమిత సంఖ్యలోనే తీసుకుంటోంది. 


లేఆఫ్ బాట పట్టకుండా ఉండేందుకు యాపిల్ యాజమాన్యం శతథా ప్రయత్నిస్తోందని బ్లుమ్‌బర్గ్ పత్రిక జర్నలిస్ట్ మార్క్ గర్మన్ తెలిపారు. యాపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కొత్త తరం హోంపాడ్ ఉత్పత్తి ప్రారంభాన్ని వాయిదా వేస్తున్న యాపిల్.. ఆర్థికవనరులను తక్షణ అవసరాలకు కేటాయిస్తోందని సమాచారం. 


ఏటా రెండు సార్లు ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లు ఇచ్చే యాపిల్ ఈమారు ఈ విషయాల్లో దూకుడు తగ్గించింది. వృధా ఖర్చులు తగ్గించే క్రమంలో వివిధ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌లో కోతలు విధించింది. అంతేకాకుండా.. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల పర్యటనలకు కూడా కత్తెర వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగిస్తే.. యాపిల్ నాయకత్వం తప్పు చేసిందన్న సంకేతాలు వెళతాయని యాపిల్ భావిస్తోంది. అంతేకాకుండా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అనుకున్న దానికంటే మరింత దిగదుడుపుగా ఉన్నాయన్న భావన కూడా మొదలవుతుందని యాపిల్ యాజమాన్యం అభిప్రాయంగా ఉన్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa