మరణశిక్ష విషయంలో కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది. మరణశిక్ష పడ్డవారిని ఉరి తీయడం క్రూరమైందా?, దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం సూచించింది. మరణ శిక్ష పడినవారికి ఉరి కంటే తక్కువ బాధాకరమైన ప్రత్యామ్నాయం ఉంటుందా? అని కేంద్రం ఆలోచించాలని పేర్కొంది. ఉరికి వేలాడదీయడం కంటే తక్కువ బాధ కలిగించే పద్ధతి ఏదైనా ఉందా? లేదా? అని పరిశీలనకు చర్చను ప్రారంభించి, సమాచారాన్ని సేకరించాలని కోరింది. ఉరిశిక్ష మరణాల ప్రభావంపై ఏదైనా అధ్యయనం నివేదికతో కోర్టుకు రావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించింది.
మరణ శిక్ష పడ్డ దోషులకు ఉరిలేకుండా ప్రత్యామ్నాయంగా నొప్పి కలిగించని విధానాన్ని చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం.. ఈ అంశంపై చర్చకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఉరి తీయడానికి బదులుగా కాల్చడం, విషపు ఇంజెక్షన్ లేదా విద్యుత్ కుర్చీ వంటివి పరిశీలించాలని పిటిషనర్ కోరారు. ఉరి ప్రక్రియ పూర్తి క్రూరమైనది అని లా కమిషన్ నివేదికను చదివిన లాయర్ రిషి మల్హోత్రా అన్నారు.
‘‘అవును ఇది ప్రభావం చూపే విషయం. మన చేతుల్లో కొంత శాస్త్రీయ సమాచారం ఉండాలి... దీనిపై అధ్యయనానికి కొంత డేటా ఇవ్వండి.. మేము ఒక కమిటీని ఏర్పాటు విషయాన్ని తరువాత విచారణలో పరిశీలిస్తాం.. ’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ తదుపరి విచారణను మే 2కి వాయిదా వేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు.
‘ఈ రోజుల్లో మరణం హుందాగా ఉండాలనేది లేదా నొప్పి తక్కువగా ఉండాలనేది ప్రశ్న కాదు ... ఉరి ఈ రెండు పరిస్థితులను సంతృప్తి పరుస్తుంది ... ఈ లెక్కన అమెరికాలో అమల్లో ఉన్న విషపు ఇంజెక్షన్ సంతృప్తికరంగా ఉందా? ’ అని జస్టిస్ పీఎస్ నరసింహ అన్నారు. ఒకవేళ ఇటువంటి ఇంజెక్షన్లు కూడా బాధాకరమైనవి అయితే, తుపాకీతో కాల్చే విషయానికి వద్దాం.. ఇది మానవ హక్కులను పూర్తిగా ఉల్లంఘించే సైనిక పాలనలో చర్య అని సీజేఐ పేర్కొన్నారు. అలాగే, ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష అమలుచేయడంలో ఎటువంటి రసాయనాలను వినియోగిస్తున్నారో అధ్యయనం చేయాలని సూచించారు. ‘ఈ పద్దతి దామాషా పరీక్షను సంతృప్తి పరుస్తుందో.. మరొక పద్ధతి అవలంబిస్తే ఉరి మరణాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించగలరో చూడాలి’ అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa