ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమృత్‌పాల్ సింగ్... వరుసగా నాలుగో రోజు కొనసాగుతున్న పోలీసుల ఆపరేషన్

national |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 09:21 PM

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ను పట్టుకునే ఆపరేషన్ ఎంత వరకు వచ్చిందని, దీనికి సంబంధించిన ప్రస్తుత నివేదికను సమర్పించాలని పోలీసులు పంజాబ్ హరియాణా హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో వేల మంది పోలీసులు ఒక్కడ్ని పట్టుకోలేకపోయారా? మీరంతా ఏం చేస్తున్నారని అక్షింతలు వేసింది. ‘మీరు 80 వేల మంది పోలీసులు ఉన్నారు.. అటువంటిప్పుడు అమృత్‌పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు’ అని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇది నిజంగా రాష్ట్ర పోలీసులు నిఘా వైఫల్యమేనని వ్యాఖ్యానించింది.


ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ గత శనివారం పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి పంజాబ్ వ్యాప్తంగా అతడి కోసం పోలీసులు, సైన్యం జల్లెడపడుతున్నాయి. ఇక, అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోడానికి శనివారం భారీ ఆపరేషన్ చేపట్టామని.. ఇప్పటి వరకూ అతడి మద్దతుదారులను 120 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. శనివారం జలంధర్‌లో ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అమృత్‌పాల్‌ను పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నించగా.. అతడు తప్పించుకున్నాడు. బాలీవుడ్ సినిమాను తలపించేలా 100 కార్లతో అతడ్ని దాదాపు 25 కిలోమీటర్ల ఛేంజ్ చేశారు. అయినాసరే అతడు పోలీసుల కళ్లుగప్పి మోటార్ సైకిల్‌పై పారిపోయాడు.


గతేడాది ఫిబ్రవరి వరకూ ఏ అనామకుడిగా ఉన్న అమృత్‌పాల్ సింగ్.. పాక్ గూఢచారి సంస్థతో చేతులు కలిపి తెరవెనుక చాలా కథ నడిపించినట్టు నిఘా నివేదికలు పేర్కొంటున్నాయి. దుబాయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేసిన సమయంలోనే ఐఎస్ఐ ఏజెంట్లను కలుసుకుని.. జార్జియాలో ఆ సంస్థ ఉగ్రవాదుల వద్ద శిక్షణ తీసుకున్నట్టు తెలిసింది. శిక్షణ తర్వాతే ఐఎస్ఐ వ్యూహాన్ని అమలు చేయడానికి అతడు భారత్‌కు వచ్చినట్టు వెల్లడయ్యింది. నటుడు దీప్ సిద్ధూ చనిపోయిన తర్వాత అతడు స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థను హైజాక్ చేశాడు. తనను తాను అధినేతగా ప్రకటించుకున్నాడు.


ఖలిస్థానీ వేర్పాటువాది, ఉగ్రవాది జర్నైల్ బింద్రన్‌వాలే అనుచరుడిగా చెప్పుకునే అతడు అమృత్‌పాల్‌ను అతడి మద్దతుదారులు ‘బింద్రన్‌వాలే 2.0గా భావిస్తారు.


రాష్ట్రంలో ప్రశాంతత, సామరస్యాన్ని దెబ్బతీసేవారిపై కఠిన చర్యలు తప్పవని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హెచ్చరించారు. ‘దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఎవరినైనా వదిలిపెట్టం.. పంజాబ్ ప్రజలు శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నారు’ అని అన్నారు. అమృత్‌పాల్‌ అరెస్ట్ కోసం ఆపరేషన్ చేపట్టిన తర్వాత పంజాబ్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదని సీఎం పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa